రవీంద్రభారతి, డిసెంబర్ 26: జన్మనిచ్చిన తల్లిని, స్వగ్రామాన్ని, మాతృదేశాన్ని ఎప్పటికీ మరువరాదని కేంద్ర పర్యాటక మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. భారత్ అభివృద్ధిలో ప్రవాస తెలుగు ప్రజలంతా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజానికి మనం చేసిన సేవలే చిరకాలం గుర్తుంటాయని, సామాజిక సేవకు మించిన భాగ్యం మరొకటి ఉండదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం సాయం త్రం అమెరికా తెలుగు సంఘం (ఆటా) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి రోజు రోజుకూ ఇనుమడిస్తున్నదని, అన్ని రంగాల్లో తెలుగువారి విజయాల పరంపర కొనసాగుతున్నదని తెలిపారు. మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి కూడా తొలుత ప్రవాస తెలంగాణ వాసులే వెన్నుదన్నుగా నిలిచి స్వరాష్ట్ర ఆవిర్భావంలో కీలపాత్ర పోషించారని పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారంతా సొంత గ్రామాలకు దేశానికి విశేష సేవలందిస్తున్నారని, ప్రవాస తెలుగు ప్రజల కృషి వల్లే ప్రపంచ దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని కొనియాడారు.
దేవులపల్లి అమర్కు ఎక్స్లెన్స్ అవార్డు
అనంతరం అన్నమాచార్య భావనా వాహిని సంస్థ చైర్మన్ శోభారాజును ఆటా జీవిత సాఫల్య పురస్కారంతో, సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ను ఆటా ఎక్స్లెన్స్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. అమర్ మాట్లాడుతూ.. తెలుగు భాష, సాంస్కృతిని ప్రోత్సహిస్తూ ప్రవాస భారతీయుల కోసం ఆటా విశేషంగా కృషిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, సినీహీరో సుమన్గౌడ్, భానుచందర్, సరస్వతీ ఉపాసకుడు దైవజ్ఞశర్మ, ఆటా అధ్యక్షుడు భువనేశ్ భూజూల, చైర్మన్ మధు బొమ్మనేని, కో-చైర్మన్ అనిల్ బోజిరెడ్డి, శరత్ వేముల తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా కళాకారులు నిర్వహించిన శాస్త్రీయ, జానపద, సినీ సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతో అలరించాయి.