ములుగు : రాష్ట్రంలో ములుగు జిల్లాలో పడినంత వర్షం చరిత్రలో ఎప్పుడు చూడలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో ములుగు జిల్లా ఇన్చార్జి ప్రత్యేక అధికారి యస్. కృష్ణాదిత్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి ప్రత్యేక అధికారి గౌతమ్ పొట్రూ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలో 70 సెంటీమీటర్లు పైగా భారీ వర్షపాతం నమోదు కావడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు జిల్లాలో 8 మంది మృత్యు వాతపడ్డారని వివరించారు.
మృతి చెందిన బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ( Exgratia ), అన్ని విధాలుగా నష్టపోయిన వారికి రూ. 25 వేలు తక్షణమే అందిస్తామని అన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ (CM ) కోటి రూపాయలను మంజూరు చేశారని తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరువంచ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు నీటి ప్రభావంలో కొట్టుకపోయారని వెల్లడించారు. రెండు జిల్లాలలో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ ( Helicopter) కేటాయించారని తెలిపారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నామని వివరించారు.
హెలికాప్టర్ ద్వారా ఆహారం, మంచినీరు
ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో 80 మంది గ్రామస్తులు నీటిలో చిక్కుకోగా వారికి హెలికాప్టర్ ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నామని అన్నారు. వర్షాల వల్ల అనార్యోగం బారిన పడకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఏటూరు నాగారం సమీపంలోని రామన్నగూడెం వద్ద గల పుష్కర ఘాటు వద్ద గతంలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 18 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని అన్నారు.
జిల్లాలో 27 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాలను వెయ్యికి పైగా మంది బాధితులు ఉన్నారని, రానున్న రోజులలో ఇలాంటి ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. చేపలు పట్టేందుకు చెరువులో దిగే మత్స్యకారులపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు.
దెబ్బతిన్న రోడ్లకు పరమ్మతులు
కూలిపోయే ప్రమాదకరంగా ఉన్న రోడ్ల రాకపోకలను నిలిపివేశామని, దెబ్బతిన్న రోడ్లను పరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.