గద్వాల, ఆగస్టు 1 : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రెండ్రోజుల కిందట అసెంబ్లీ కారిడార్లో బండ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనిపిస్తే పాత పరిచయం కొద్ది వారితో మాట్లాడినట్టు పేర్కొన్నారు. అందరం కాంగ్రెస్లోనే ఉన్నామని పేర్కొన్నారు.
గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి అల్పాహారం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీలో ఎవరి గౌరవం వారికి ఉంటుందని అన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఎమ్మెల్యేను కలిసినట్టు చెప్పారు.
మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాత్రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల తమ పార్టీలోనే ఉన్నారని చెబుతుంటే పక్కనే ఉన్న బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాత్రం నోరు మెదపకపోవడం కొసమెరుపు. పార్టీలో ఉన్నారా? లేదా? అని మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. మౌనం వహించారు.