హైదరాబాద్, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ రెండూ బీసీ వ్యతిరేక పార్టీలేనని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఆ పార్టీల బీసీ రాగాన్ని తెలంగాణ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీ ముఖ్యమంత్రి అంటూ బీజేపీ కపట ప్రేమను కనబరుస్తున్నదని, గెలువని స్థానాలను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు ఇస్తున్నదని తెలిపారు. బీజేపీకి నిజమైన ప్రేమే ఉంటే బీసీ అయిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు.
బీసీ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు మేలు జరుగుతుందని నమ్మారని, కానీ కనీసం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదని వివరించారు. బీసీ జనగణన చేయాలని కోర్టులు చెప్పినా కేంద్రం నుంచి స్పందన కరువైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీకి కనీసం నాలుగు సీట్లు కూడా రావని పేర్కొన్నారు. బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సరైన న్యాయం జరిగిందని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు బీసీ వర్గాలకు అందుతున్నాయని వివరించారు. కేసీఆర్ సీఎం అయితేనే రాష్ర్టానికి, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 90కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలవమని తెలిసే బీజేపీ బీసీ రాగం ఎత్తుకున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ ఎత్తుగడను రాష్ట్రంలోని బీసీ వర్గాలు తిప్పికొడతాయని స్పష్టం చేశారు.
తమ సంక్షేమానికి విశేషంగా పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముదిరాజ్లు ఏకతాటిపై ఉండి మళ్లీ నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించాక గతంలో అనివార్య కారణాల వల్ల తాను బీఆర్ఎస్ పార్టీని వీడానని, ఇప్పుడు సొంతింటికి వచ్చినట్టు ఉన్నదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో సీఎం కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉంటానని తెలిపారు. బీజేపీలో తనకు కనీస మర్యాద ఇవ్వలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చానని, తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అని తేల్చి చెప్పారు. అనివార్య కారణాల వల్లే కేసీఆర్ ముదిరాజ్లకు టికెట్లు ఇవ్వలేదని, సిటింగ్లలో ఎవరూ లేనందునే ఆ వర్గానికి రాలేదని తెలిపారు. రాబోయే రోజుల్లో ముదిరాజ్లకు ఎన్నో అవకాశాలు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు.