నిజామాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ సభలో జనాలు లేరని అవాస్తవం మాట్లాడుతున్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గురువారం నిజామాబాద్లో కంటి వెలుగును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాలేదు, సంజయ్కు బ్రెయిన్ ఫెయిల్యూర్ అయ్యింది. ఆయనకు ఏదో ఒక విమర్శ చేయాలని అనడం తప్పా. ఆయన మాటల్లో ఏం లేద’ని పేర్కొన్నారు.‘ఇరుకు గల్లీలో పెట్టుకునే నీ ప్రజా సంగ్రామ సభలో ఎంత మంది ఉంటున్నారు. అసలు మీకు బహిరంగ సభల గురించి ఏం తెలుసు.మీడియా ముందు మాట్లాడుడు. చౌరస్తాలో మాట్లాడుడు. అంతే మీకు తెలసని ’ ఎద్దేవా చేశారు.
ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తాను ఇప్పటివరకు ఇంత పెద్ద సభ చూడలేదని ఆశ్చర్యపోయారని తెలిపారు. సభకు వచ్చిన జనాలు బండి సంజయ్ కు కనిపించక పోవడం దురదృష్టకరమని ఆరోపించారు. కంటి వెలుగు ప్రోగ్రాంకు ఆధార్ కార్డు తీసుకొనిపోతే రాష్ట్రంలో ఎక్కడైనా కంటి పరీక్ష చేస్తారని అక్కడికి వెళ్లి కళ్లను చూపించుకోవాలని సూచించారు. కంటి వెలుగు ‘వరల్డ్ లార్జెస్ట్ ఐ స్క్రీన్ టెస్ట్’ ప్రోగ్రాం గిన్నీస్ బుక్ రికార్డ్ కానుందని తెలిపారు. ముఖ్యమంత్రికేసీఆర్ ప్రవేశ పెట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్ని మానవీయ కోణంలోనే ఉంటాయని వెల్లడించారు. ఓట్ల కోసమో,రాజకీయం కోసమో కాదని తేల్చిచెప్పారు.