Vinod Kumar | ఎంపీ హోదాలో ఉండి బండి సంజయ్ సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బండి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని.. ఇది ఏమాత్రం పద్ధతికాదన్నారు. రాజన్న సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ, హరితహారం, అంగన్వాడీ, ప్రధానమంత్రి సడక్ యోజన పథకాలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను తాను తెచ్చినట్లుగా ఎంపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర పథకాలు ఏ పార్టీ వారు ఉన్నా ఎంపీ హోదాలో ఉన్న వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అదనంగా వందరోజుల పని కల్పించేందుకు ఉపాధిహామీని 2005లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఉపాధిహామీ ప్రజల హక్కని.. దానికి ఇచ్చే నిధులను తాను ఇచ్చినట్లు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.
ఐదేళ్ల పదవీకాలంలో కరీంనగర్ పార్లమెంట్లో జాతీయ రహదారైనా తెచ్చాడా? ట్రిపుల్ ఐటీలు, నవోదయ పాఠశాల, పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు, పవర్లూం కస్టర్ అయినా తెచ్చావా సంజయ్ అంటూ నిలదీశారు. 2014-19 వరకు తాను ఎంపీగా కొనసాగిన సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారా స్మార్ట్ సిటీని తీసుకువచ్చి రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. 70 ఏళ్ల ప్రజల ఆకాంక్ష అయిన మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ మంజూరు చేయించానని.. ప్రస్తుతం సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నట్లుగా తెలిపారు. ఎల్కతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, పిట్లం వరకు జాతీయ రహదారిని మంజూరు చేయించినట్లు చెప్పారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ నిర్మాణం కోసం అప్పటి కలెక్టర్ నీతూ ప్రసాద్ భూమి కూడా కేటాయించారని.. బండి సంజయ్ ఎంపీ అయ్యాక ట్రిపుల్ ఐటీ కోసం నోరుమెదపలేదన్నారు. ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలని.. గ్రామీణ పేదవర్గాలకు చెందిన పిల్లలకు విద్య అందాలనేది లక్ష్యమని.. కానీ తెలంగాణలో తొమ్మిది మాత్రమే పాఠశాలలు ఉన్నాయన్నారు. మరో 23 ఇవ్వాలని ఐదేళ్ల కాలంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదుల సంఖ్యలో లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు ఒక్క నవోదయను సాధించలేకపోయారని విమర్శించారు. రాజకీయ పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయని.. ఎవరూ శాశ్వతం కాదన్నారు.
బండి సంజయ్ పాదయాత్రలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హితవు పలికారు. తనకు బోయినపల్లి మండలం నర్సింగాపూర్లో 20 ఎకరాల భూమి ఉందని బండి సంజయ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తన సతీమణి మాధవి 30 సంవత్సరాలుగా వైద్యవృత్తిలో కొనసాగుందని.. తన తల్లిగారి ఊరు అయిన నర్సింగాపూర్లో వ్యాపారవేత్త అనంతరావు దగ్గర ఆ భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో మమత మెడికేర్ సెంటర్ ఉందని.. అవన్నీ తన కష్టార్జితంతో సంపాదించిన సొమ్ముతోనే కొనుగోలు చేశారని తెలిపారు. హైదరాబాద్లో రూ.500కోట్ల ఆస్తి ఎక్కడ ఉందో బండి సంజయ్ ఆస్తిపత్రాలు తీసుకువస్తే సంతకం పెడతానన్నారు. అడ్డగోలు అబద్ధాలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడాలన్నారు. తన గురించి ఐఏఎస్ అధికారులను అడగాలంటూ సూచించారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. యాసంగి పంటకు రూ.500 బోనస్ ఇస్తున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్, మేలో బోనస్ ఇచ్చేదాకా కొట్లాడామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో కానిస్టేబుల్, స్టాఫ్నర్సులు, గురుకుల ఉపాధ్యాయల పోస్టుల భర్తీ కోర్టు కేసుల ద్వారా నిలిచిపోయానని వినోద్కుమార్ తెలిపారు. 25వేల ఉద్యోగాలను తాము ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక 60 గ్రూప్-1 పోస్టులను మాత్రమే జత చేశారని.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. ఖాళీలను ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నించారు. డిసెంబర్ చివరి నాటికి 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల జీవితాలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆడలాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పి.. బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.