Ex MLA Jeevan Reddy | ఎంపీగా మరోసారి రంజత్రెడ్డి గెలిస్తే చేవెళ్లనే అమ్మేస్తాడని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజిత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో 3వేల ఎకరాలను కబ్జా చేసి, అక్రమించి సంపాదించారని ఆరోపించారు. అసైన్మెంట్ భూములను తన భూములుగా చూపించి.. తప్పుడు పత్రాలకు బ్యాంకుల వద్ద నుంచి రూ.కోట్ల రుణాలు తీసుకున్నారన్నారు. పుప్పాలగూడలో ప్రభుత్వ, కాందిశీకుల భూమిల్లో భారీ ఎత్తున అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారన్నారు.
కోళ్ల దాణాలోనూ కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి బీజేపీలోకి వెళ్తాడని, మోసగాళ్లకే మోసగాడు రంజిత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. అవినీతి అనకొండలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ చేవేళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మోసగాళ్లకు మోసగాడని, ఫాదర్ ఆఫ్ చీటర్ అని అభివర్ణించారు. ఆయన అవినీతి చరిత్ర అనకొండ అంత ఉందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజిపేట గ్రామంలో 591/అ/1 సర్వే నెంబర్లో 9.27 ఎకరాలు, 591/ఆ సర్వే నెంబర్లో 4.22 ఎకరాల అసైన్డ్ భూములను చూపించి బ్యాంకు రుణాలు తీసుకున్నారన్నారు.
కోళ్ల దాణా సఫ్లయ్ పేరుతో కోళ్ల ఫారాలనే మింగేసిన ఘనుడు విమర్శించారు. సినీ నిర్మాత బండ్ల గణేశ్ భూమిని కూడా రంజిత్ రెడ్డే గుంజుకున్నాడన్నారు. బ్యాంకులను మోసం చేసే రంజిత్రెడ్డి చేవెళ్ల ప్రజలకు ఏం మేలు చేస్తాడో అర్థం కావడం లేదన్నారు. పుప్పాలగూడ సర్వే నంబర్ 341 లో 1.40 కోట్ల చదరపు అడుగుల మేర ప్రభుత్వ, కాందిశీకుల భూమిలో వెస్ట్రర్న్ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేస్తున్నారని, దీనిపై స్థానిక తహిసిల్దార్, ఆర్డీవోలు వారికి నోటిసులు కూడా జారీ చేశారని, అయినా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంస్థ ఇటీవలే కాంగ్రెస్లో చేరిన జితేందర్ రెడ్డి వియ్యంకుడదని.. ఇందులో రంజిత్ రెడ్డి, జితేందర్రెడ్డిలకు వాటాలు ఉన్నాయన్నారు.
రంజిత్ రెడ్డికి ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల ఖర్చును డబ్బులు ఖర్చు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పదం కుదుర్చుకున్నారన్నారు. ఆయనతో కలిసి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భూ కబ్జాలు చెయ్యడంలో దిట్ట అన్నారు. పంచ భూతాలను వదలని వ్యక్తి రంజిత్ రెడ్డి ఆయన అవినీతి చేయని అవినీతి రంగంలేదన్నారు. కరీంనగర్ లో పుట్టిన రంజిత్ రెడ్డి, వరంగల్లో పెరిగారని, చేవెళ్ల వ్యక్తే కాదన్నారు. పక్కా నాన్ లోకల్ అని.. వలస వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నాడని, చేవెళ్ల ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రంజిత్ రెడ్డిని చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.