Srinivas Goud | మహబూబ్నగర్ : రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు ఇస్తామని చెప్పిన రైతు బంధు ఇవ్వండి.. రుణమాఫీ చేయండి. వడగండ్ల వానతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. వాటికీ నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోకుండా మొలకెత్తినా వడ్లను కూడా కొనుగోలు చేశామని గుర్తు చేశారు. వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 40 వేల సహాయం అందించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీ అయిందని అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులు క్షేత్ర స్థాయిలోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయి. ప్రభుత్వం రైతుల పాలిట నిర్లక్ష్యం వహిస్తే మరో పోరాటానికి రైతులు సిద్ధమవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది. కాంగ్రెస్ అసమర్ధ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. పంట నష్టపోయిన రైతుల వివరాలని ప్రభుత్వానికి పంపించాలి. మహబూబ్ నగర్ మండల పరిధిలోని చాలా గ్రామాల్లో పంట దెబ్బతిన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి వెంట మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, రైతు కమిటీ అధ్యక్షులు కొండయ్య, సీనియర్ నాయకులు నెత్తికొప్పుల శ్రీను, చెన్నయ్య, జంబులయ్య, పెద్ద చెన్నయ్య, రాజుయాదవ్, అనంత రెడ్డి, బాలకిష్టయ్య, హరీష్ చందర్, వెంకన్న, మాధవులు, శ్రీనివాసులు, వెంకటయ్య, తిరుపతయ్య, బలవర్దన్, రామకృష్ణ ఉన్నారు.