Singireddy Niranjan Reddy | పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పక్కన పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు నదీ జలాలలో సాగునీటి వాటాపై వనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సింగిరెడ్డి దుయ్యబట్టారు. రూ.34 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్మించామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ తలపెట్టిన భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను తలదన్నే ప్రాజెక్టులను చేపట్టామని గుర్తు చేశారు. ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్ చేపట్టిన ఏ ప్రాజెక్టూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కిందకు పనికిరావని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకుని తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని.. 5,10 వేల కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని ఏడాదిగా మొత్తుకుంటున్నా కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చారు తప్పితే పెండింగ్ పనులను పూర్తి చేయడం లేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే నీళ్లు వస్తాయని చెబుతున్నా .. వాటిని పూర్తి చేయకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి నీళ్లు రాలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ఈ నాలుగు నెలలలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ వెంట మేము ఢిల్లీకి వస్తాం .. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతామని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం 86 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. లక్ష కోట్లు అవినీతి జరిగిందని అబద్దపు ప్రచారం చేసిందని.. ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లతో హైదరాబాద్ గొంతు తడుపుతున్నది వాస్తవం కాదా ? ఎన్ని రోజులు అబద్దాలతో కాలం గడుపుతారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అవివేకం, అవినీతి మూలంగా ఆరు దశాబ్దాలు తెలంగాణ ఆగమైపోయిందన్నారు.
కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ అభాండాలు వేస్తూ కాలం గడుపుతున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఈ వానాకాలంలో ఒక్క కృష్ణా నది నుంచి ఏపీ ప్రభుత్వం 660 టీఎంసీలను హక్కులకు విరుద్ధంగా వాడుకున్నదని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి ప్రతి రోజూ పది వేల క్యూసెక్కులు కొల్లగొడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి నోరెత్తడం లేదని విమర్శించారు. అక్రమంగా తరలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నోరేత్తి మాట్లాడుతున్నా.. రేవంత్ రెడ్డి మాత్రం నోరు తెరవడం లేదని అన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరెంటు, ఐటీ, పంటల కొనుగోళ్లు, పారిశ్రామిక విధానంతో తెలంగాణ తలసరి ఆదాయాన్ని 3.26 లక్షలకు తీసుకెళ్లామని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణను దేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రాంగా తీర్చిదిద్దాం.. ఏడాదిలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, విద్యార్థుల మరణాలతో తెలంగాణను తిరోగమనంలోకి తీసుకెళ్లారని చెప్పారు. ఫించన్లు రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2500, రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలు ఇస్తామని, మూడు ఎకరాల వరకు కూడా ఇవ్వకుండా అందులో 10 లక్షల ఎకరాలు రైతుల భూములు గయాబ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అడుగు అడుగునా మోసం .. వంచన .. ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. ఈ విషయాల మీద ఏ మంత్రి మాట్లాడతాడో చెప్పండి .. బహిరంగ చర్చ చేద్దామని డిమాండ్ చేశారు.
నదీజలాల వాడకం విషయంలో కేసీఆర్ మీద, హరీశ్ రావు మీద ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. అసలు తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా అని ప్రశ్నించారు. మిగులు జలాల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నాడని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. కరువు ఫ్లోరైడ్, వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు, బలవంతపు మరణాలు.. ఇవి కాంగ్రెస్ తెలంగాణకు ఇచ్చిన కానుక అని విమర్శించారు. గ్రామాలలో ప్రజలు అందరూ పొట్టకూటి కోసం వలసలు వెళ్లిన దుస్థితి .. గత పదేళ్లలో తెలంగాణ గ్రామాలు ఎంత బాగుపడ్డాయో అందరికీ తెలిసిందే అని అన్నారు. తెలంగాణలో సాధారణ రైతులు కూడా క్యూసెక్కులు, టీఎంసీల గురించి మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమమే అని అన్నారు. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు .. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ పనులు, ఎక్కువ ప్రయోజనాలు చేస్తేనే ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. తెలంగాణ తెచ్చిన పదేళ్ల కాలంలో ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టామని తెలిపారు.