Niranjan Reddy | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తామని రాష్ట్రప్రభుత్వం సంతకం చేయడమంటే తెలంగాణ ప్రజల గొంతు కోయడమేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఒకవేళ రాష్ట్రం మినిట్స్పై సంతకం చేయకుంటే వెంటనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రాన్ని నిలదియాలని సూచించారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశ మినిట్స్ చూసి అభ్యంతరం చెప్పకుండా ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు.
రాష్ట్రం ఒప్పుకోకపోయినా కేంద్రం మీటింగ్ మినిట్స్ చేరిస్తే వాటిపై వెంటనే అభ్యంతరం తెలపాలని డిమాండ్ చేశారు. కృష్ణా నీటిలో తెలంగాణకు శాశ్వత కేటాయింపులు జరగకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్, వాటి పరిధిలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆ ప్రాజెక్టులు రాష్ట్ర పరిధిలోనే ఉండేలా స్టేటస్ కో మెయింటెయిన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందా? బలిపెడుతుందా? అని నిలదిశారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్కే ప్రయోజనమని, వారు కోరుకున్నదే ఇప్పుడు జరిగిందని అన్నారు. ఇన్నాళ్లు ఆ నిర్ణయాన్ని కేసీఆర్ నిలువరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిలువరించడంలో విఫలమైందని మండిపడ్డారు.
మినిట్స్పై ఎందుకు స్పందించరు?
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ల కోసమని, ఎన్ని వత్తిళ్లు ఎదురైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేసీఆర్ నిలబడ్డారని నిరంజన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, సాగర్, శ్రీశైలంతో పాటు కొత్త ప్రాజెక్టులకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ పాలమూరు, నల్లగొండ, ఖమ్మం ప్రజల గొంతుకోసిందని ధ్వజమెత్తారు.
ఆంధ్రా ప్రయోజనాల కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం వంత పాడుతున్నదా? అని ప్రశ్నించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి డ్యామ్లు వెళితే శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉండదని, రాష్ర్టానికి కరెంటు కష్టాలు మొదలైతాయని హెచ్చరించారు. 15 అవుటలెట్లను కేఆర్ఎంబీ స్వాధీనం చేసుకొన్నా ఏపీ ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తుందని తెలిపారు. కేఆర్ఎంబీ ప్రకటనపై రాష్ట్ర మంత్రుల స్పందన విచిత్రంగా ఉన్నదని, అపర మేధావులు అనేకునే కొందరు దీనిపై ఎందుకు స్పందించడంలేదని నిలదిశారు.
నాడు నోరు మెదపకుండా
సీలేరు, ఏడు మండలాలు ఆంధ్రాలో కలపడంపై ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదని నిరంజన్ రెడ్డి నిలదీశారు. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై కేంద్రంతో కేసీఆర్ ఏనాడూ రాజీపడలేదని తెలిపారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్తే చేతులు ముడుచుకుని ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో బొందపెడతామన్న సీఎం రేవంత్రెడ్డి ప్రకటనపై నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ను బొంద పెడతామన్నవాళ్లు చాలామంది బొందలో కలిసిపోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వచ్చి 45 రోజులైనా హామీల గురించి దృష్టి పెట్టలేదని విమర్శించారు.