Koppula Eshwar | ధర్మపురి : అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ధర్మపురి ప్రజల కోసమే తన తపన అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓడిపోయామని కార్యకర్తలు కుంగిపోరాదని.. అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. వరుసగా విజయాలు సాధించినప్పుడు ఎగురలేదు.. ఓడినప్పుడు బాధపడనన్నారు. ప్రజల తీర్పుకు శిరసావహించుడే.. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగకూడా వాలనీయనని స్పష్టం చేశారు. “సౌమ్యుడు, మెతకమనిషి ”అనేది ఒకవైపు మాత్రమే.. ఇవ్వన్నీ పక్కనబెడితే ఎదుటివారు తట్టుకోవడం కష్టమని అన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ధర్మపురి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమావేశానికి రాగానే కార్యకర్తలు ఉద్వేగానికి గురై గుండెల నిండా దుఃఖంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోరాదని ధైర్యం చెప్పారు. ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థి అనుకుని పనిచేశారని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయామని అన్నారు. బీఆర్ఎస్కు ఒడిదొడుకులు కొత్తకాదని, రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి పకడ్బందీ కార్యాచరణతో ముందుకుపోదామని పిలుపునిచ్చారు.
సౌమ్యుడు..మెతకమనిషి ఒకవైపు మాత్రమే
ఈశ్వర్ అంటే సౌమ్యుడు, మెత్తటి మనిషి, అనే భావనతో కొందరు హద్దులు మీరితే ఊరుకునేది లేదని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. సౌమ్యుడు, మెతక మనిషి అనేది ఒక కోణం మాత్రమేనని.. మరో కోణం నుంచి చూస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడినా, వారిని ఇబ్బందులకు గురుచేసినా ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోనన్నారు. ధర్మపురి నియోజవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచినా ఎవరినీ నొప్పించలేదని, ఆ పరిస్థితి తీసుకురావద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు పలికారు. ఓడినా, గెలిచినా ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తానని, తాను ఈ స్థాయికి అంత సులువుగా రాలేదని నిప్పుల్లో నడిచి వచ్చానని కొప్పుల గుర్తు చేశారు. సందర్భం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడమే తన పాలసీ అన్నారు. ప్రజలను మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామన్నారు.
ధర్మపురిలో మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనీ, మనలో ఏమైనా లోపాలు ఉంటే ఆత్మపరిశీలన చేసుకొని సమీక్షించుకుందామని సూచించారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, పోరాటాలు కొత్త కాదని అన్నారు. భవిష్యత్ బీఆర్ఎస్దేనని, కేసీఆర్ దమ్మున్న నాయకుడు గనుకే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు.. ప్రభుత్వంలోకి రాలేకపోయామనే బాధ లోపల ఉన్నా …కార్యకర్తలు దాన్ని మరచిపోయి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, బీఆర్ఎస్ త్యాగాల పార్టీ అని..పదవులను గడ్డి పోచల్లా వదలి పెట్టామని గుర్తుచేశారు. కొన్ని రోజుల్లోనే ఏది మంచో ఏది చెడో ప్రజలు గుర్తిస్తారన్నారు. బీఆర్ఎస్ పాలక పక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఎపుడూ ప్రజల పక్షమేననీ, కష్టపడి పని చేసి ..కలసి కట్టుగా పని చేసి ముందుకుసాగుదామని పిలుపునిచ్చారు. నియోజకవర్గం లో పార్టీ కోసం పని చేసిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకందరికి ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు.
ఉద్వేగానికి లోనై.. కన్నీరు పెట్టిన కార్యకర్తలు
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశానికి రాగానే అప్పటికే చేరుకున్న కార్యకర్తలు ఈశ్వర్ను చూడగానే ఉద్వేగానికి లోనయ్యారు. ఈశ్వర్పై పడి కన్నీరుపెట్టుకున్నారు. కొప్పుల ఈశ్వర్ కూడా కొంత ఉద్వేగానికి లోనయ్యారు.. అయినప్పటికీ ఈశ్వర్ తన దుఃఖాన్ని దిగమింగుకొని కార్యకర్తలకు దైర్యం చెప్పారు. ముఖ్యంగా మహిళలు ఈశ్వర్ను చూడగానే భోరున విలపించారు. ఒక రకంగా చెప్పాలంటే సభాప్రాంగణమంతా శోకసంద్రమైంది. అందరినీ ఈశ్వర్ సముదాయించారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని, బీఆర్ఎస్ కార్యకర్తలు వీరసైనికులనీ, ఒక యుద్ధంలో ఓడగానే, మరో యుద్దానికి సన్నద్దం కావడమే సైనికుల లక్షణమన్నారు. ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చకుంటే ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.