Jagadish Reddy | మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో లేదని.. ఆ అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. రైతుల కోరిక మేరకు ఆయన చేపట్టిన పర్యటన ఐదోరోజు గురువారం కొనసాగింది. యార్కారం, రేఖ్యానాయక్ తండాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించి.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారన్నారు. హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు 25 నుంచి 30వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారన్నారు.
ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. జాలువారిన పంట పొలాలు నేడు మోడు వారడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే.. మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని.. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. రైతుబంధు రాలేదని ప్రశ్నించిన రైతును మంత్రి చెప్పు తీసుకొని కొడతాననడం దుర్మార్గమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయడం లేదని.. పంట నష్టంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు.