సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : యజమాని పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి రూ.కోటి నగదును కాజేసిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. యూపీలోని లక్నోకు చెందిన 37 ఏళ్ల దీపక్ కుమార్ను అరెస్ట్ చేసి, న్యాయపరమైన ప్రక్రియ ద్వారా మోసపోయిన మొత్తం రూ.కోటిని బాధితుడికి తిరిగి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో విలేకరుల సమావేశంలో సీపీ ఎం.రమేష్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు… ఆగస్టు 4 న ఓ చీరల రిటైల్ సంస్థలో పనిచేస్తున్న అకౌంటెంట్కు సంస్థ యజమాని పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ నుంచి ఆర్థిక సహాయం కోరుతూ సందేశం వచ్చింది.
అది నిజంగా యజమాని పంపిన మెసేజ్ అని భావించిన అకౌంటెంట్.. వెంటనే కరూర్ వైశ్యా బ్యాంక్ ఖాతా నుంచి కోటి రూపాయలను ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశాడు. విషయం తెలుసుకున్న యజమాని తాను ఎలాంటి మెసేజ్ పంపలేదని చెప్పడంతో తేరుకున్న అకౌంటెంట్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా మోసపూరితంగా బదిలీ చేసిన నగదు ‘రాయల్ మోడా ప్రైవేట్ లిమిటెడ్ ’ పేరుతో నిర్వహిస్తున్న కార్పొరేట్ కరెంట్ ఖాతాలోకి మళ్లినట్లు గుర్తించారు. ఈ కరెంట్ అకౌంట్ను సైబర్ మోసాల ద్వారా వచ్చిన నగదును తరలించేందుకు మ్యూల్ అకౌంట్గా ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు లక్నోకు వెళ్లి ఆగస్టు 8న దీపక్ కుమార్ను అరెస్ట్ చేశారు.
అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్పై సైబరాబాద్కు తీసుకువచ్చి, కూకట్పల్లిలోని 9వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. వేగవంతంగా దర్యాప్తు చేసిన పోలీసుల కృషికి తోడు రంగారెడ్డి జిల్లా పిడిజె, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ 9వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జోక్యంతో పోగోట్టుకున్న కోటి రూపాయలను నిందితుడికి చెందకుండా ఖాతాను బ్లాక్ చేసి, వాటిని బాధితుడికి చెల్లించే విధంగా వేగవంతమైన ఆదేశాలు జారీ అయ్యాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సిఆర్పి) ద్వారా జరిపిన తదుపరి విశ్లేషణలో నిందితుడి బ్యాంకు ఖాతాకు ఇతర రాష్ట్రాల్లో నమోదైన పలు సైబర్ క్రైమ్ కేసులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరికొందరు నిందితుల పాత్రను సైతం గుర్తించడంతో పాటు పూర్తి నగదు మార్గాన్ని (మనీ ట్రయిల్ ) వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీపీ రమేష్ వివరించారు.