సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాపై గచ్చిబౌలి, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.16.40లక్షల విలువ చేసే 95.41 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు 16 మంది డ్రగ్ వినియోగదారులను కూడా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో విలేకరుల సమావేశంలో శేరీలింగంపల్లి జోన్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్, ఎస్ఒటీ డీసీపీ శోభన్ కుమార్తో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. వట్టినాగులపల్లి కింగ్డమ్ పబ్ రోడ్డులో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్ఒటి, గచ్చిబౌలి పోలీసులు ఈనెల 11న సంయుక్తంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న యశ్వంత్ సాయి షణ్ముఖ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అలాగే 16 మంది డ్రగ్ వినియోగదారులను సైతం అరెస్ట్ చేసారు. పోలీసులకు పట్టుబడిన యశ్వంత్ను విచారించగా కేరళకు చెందిన మహ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్, బెంగళూరుకు చెందిన నవీనా కేడీ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.
దీంతో పోలీసు బృందాలు కేరళ, బెంగళూరుకు చేరుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టి, ఈ నెల 18న త్రిస్సూర్లో మహ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా యశ్వంత్కు 44.41 గ్రాముల ఎండీఎంఏ విక్రయించినట్లు అంగీకరించాడు. ఈ డ్రగ్ను ‘సామ్ ’ అనే నైజీరియన్ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అదే రోజు బెంగళూరులోని బేగూర్లో నవీనా కేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా 51 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ లభించాయి. విచారణలో కేరళకు చెందిన తన స్నేహితుడు అనేశ్వర్ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆమె వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా కుకట్పల్లికి చెందిన కొరిపెల్ల యశ్వంత్ను సైతం ఈ కేసులో అరెస్టు చేశారు. పట్టుబడిన మొత్తం డ్రగ్స్ విలువ రూ.16.40లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. శేరీలింగంపల్లి జోన్ డీసీపీ సీహెచ్ . శ్రీనివాస్, ఎస్ఒటి డీసీపీ శోభన్కుమార్ పర్యవేక్షణలో ఈ కేసును ఎస్ఒటి బృందాలు, గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేశారు.