Jagadish Reddy | కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని.. అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వస్తున్నాడనగానే ఆ పార్టీ నేతల లాగులు తడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలకు అహంకారం పెరిగిందని.. రైతుబంధు నిలిపివేశారని, రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లకు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పి దొంగనాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లయినా నదీ జలాలు పంపిణీ చేసే తీరిక కేంద్రానికి లేదని.. అలాంటిది సాగర్ నుంచి మనకు మంచినీరు కావాలంటే త్వరగా ఇస్తుందా ఆలోచన చేయాలని సూచించారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వడం అంటే ఆంధ్రాకు నీళ్లు అప్పనంగా రాసి ఇవ్వడమేనన్నారు. అప్పట్లో చంద్రబాబు సాగర్ డ్యామ్పై హుషారు చేస్తే కేసీఆర్ తరిమికొట్టారన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ చేతకానితనంతో సాగర్ మన చేతుల్లోంచి వెళ్లిపోయిందన్నారు. ఆ పార్టీ నిర్వాకం వల్ల ఈ దుస్థితి వచ్చిందన్నారు. కోమటిరెడ్డి లాంటోడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని, యాదాద్రి పవర్ ప్లాంట్ అపుతా అంటున్న కోమటిరెడ్డిని చెప్పులతో కొడతారన్నారు. కాంగ్రెస్ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే రేపటి వరకు సాగర్ ప్రాజెక్టును మన పరిధిలోకి తీసుకురావాలన్నారు. తెలంగాణకు శ్రీరమరక్ష కేసీఆర్ మాత్రమేనన్నారు. సాగర్ నీళ్ల కోసం కేసీఆర్ పోరాటం మొదలుపెడుతున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లను ఉరికించి కొడతామన్నారు. మన కళ్ల ముందే సాగర్ నీళ్లుపోతుంటే రైతుల కడుపు రగులుతోందన్నారు.
కాంగ్రెస్ సీఎం, కేబినెట్ అంతా రండనేనని.. కేసీఆర్పై ఎదురుదాడి చేసి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడమ కాల్వ రైతాంగం మళ్లీ తిరోగమనం అయ్యేలా పరిస్థితి వచ్చిందన్నారు. సాగర్ డ్యామ్ కేంద్ర బలగాల చేతికిపోయిందని.. మనలను అడుగు కూడా పెట్టనియ్యడం లేదన్నారు. ఇది కాంగ్రెస్ చేసిన నిర్వాకమని.. కాంగ్రెస్ తెలివితక్కువ తనంతో కృష్ణా నీళ్లు తరలిపోయాయన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు బూట్లు నాకేటోళ్లు కాంగ్రెస్ వాళ్లని.. రేవంత్ చంద్రబాబు శిష్యుడని.. అందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఇక యుద్ధం మొదలుపెడదాం.. కాంగ్రెస్ను తరిమికొడదామని పిలుపునిచ్చారు.