Harish Rao | రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను ఆయిల్ ఫెడ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నర్మెటలో నిర్మించడం జరుగుతుందన్నారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు.. రిపైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్ను ఇక్కడ నుంచే నేరుగా మార్కెట్లోకి పంపడం జరుగుతుందన్నారు. దీనికి కావాల్సిన 4మెగా వాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే టెక్నాలజీ ఉందన్నారు. గత మూడు సంవత్సరాల కిందట ఆయిల్ పామ్ పంటను పెట్టిన రైతుల నుంచి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానుందన్నారు. రానున్న జూన్ మాసం అంటే 5 నెలల్లో పంట ఉత్పత్తి ప్రారంభం కానుందని చెప్పారు. పంటను కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
రైతులు పండించిన ఆయిల్ పామ్కు సంబంధించిన రవాణా ఖర్చును వ్యవసాయ భూమి నుంచి నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వరకు పామయిల్ ఫ్యాక్టరీనే చెల్లిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆయిల్ పామ్కు మెట్రిక్ టన్నుకు కనీసం రూ.15వేలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఆపైన కూడా మద్దతు ధర ఇస్తే ఇంకా బాగుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడంతో విదేశాల నుంచి మన దేశానికి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతుందన్నారు.
దీంతో విదేశీ మరకద్రవ్యాన్ని కోల్పోతున్నామన్నారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్పై సెస్ విధిస్తే మన రైతుల ఆయిల్ పామ్కు ధర పెరిగి లాభం చేకూరుతుందన్నారు. పామాయిల్ రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని.. జూన్ నుంచే నర్మెటలో ఆయిల్ పామ్ పంటను కొనుగోలు చేసి అశ్వరావుపేటకు పంపుతారన్నారు. సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కు చెందిన అధికారిని అపాయింట్ చేశామని, రైతులకు కావాల్సిన సూచనలు సలహాలు చేస్తారన్నారు. ఆయిల్ పామ్లో అంతర్ పంటగా నాటు కోళ్లు, ఇతర పంటలను వేసుకొని అధిక ఆదాయం పొందాలని రైతులకు సూచించారు.