Harish Rao | మెదక్ : ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. గూండా రాజ్యం నడుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తుందని మండిపడ్డారు. నర్సాపూర్ గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గూండాయిజం రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుంది అని హరీశ్రావు తెలిపారు.
తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి.. ఈరోజు బీహార్లాగా తెలంగాణను మారుస్తున్నారని హరీశ్రావు ధ్వజమెత్తారు.
నిన్న సునీతా లక్ష్మారెడ్డి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకులు కాల్చడం, ఇంట్లోకి పటాకులు విసరడము ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఇప్పుడే ఎస్పీ, ఐజీతో మాట్లాడాను.. వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని హరీశ్రావు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ చేతిలోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే, ఆయన కింద పడిపోయాడు. పోలీసులపై దాడి జరిగినా కేసు నమోదు చేయడం లేదు. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారని హరీశ్రావు నిప్పులు చెరిగారు.
పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా? ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గూండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు.. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు. వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి. దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు తెలిపారు.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం.
ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంతో, తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది. ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డిజిపి పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్రావు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | దాడులతో సునీతా లక్ష్మారెడ్డి మనో ధైర్యాన్ని దెబ్బతీయలేరు : కేటీఆర్
KTR | ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా..? ఎందుకింత భయం నీకు రేవంత్..? నిలదీసిన కేటీఆర్
Harish Rao | అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి.. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు కౌంటర్