Harish Rao | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ఓ యూటర్న్ ముఖ్యమంత్రి అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆదాయం పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ అడ్డదారులు వెతుక్కుంటుందని మండిపడ్డారు. రేవంత్ పాలన ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది అని ధ్వజమెత్తారు.
6 గ్యారంటీలు 420 హామీల ఊసు లేదు కానీ మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తెచ్చారు. కేసీఆర్ తెచ్చిన పథకాలకు కోతలు, ప్రజలకు పన్నుల వాతలు తప్ప 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా కొత్త పాలసీ తెచ్చింది. ఇప్పుడు మద్యం షాపుల దరఖాస్తు ఫీజును ఏకంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచారు అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి.. పాలనలోకి రాగానే మోసపు చేతలు చేస్తున్నారంటూ హరీశ్రావు మండిపడ్డారు. ప్రజలపై ఆర్టీసీ బస్సు చార్జీల మోతలు వేశారు. వాహనాలపై పన్నుల భారం మోపారు, ఆర్ఆర్ టాక్స్లు వేశారు. ప్రజలకు సంక్షేమం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దె నెక్కగానే గరీబోళ్ల సంపాదనను కొల్లగొట్టే పథకాలు రచిస్తున్నారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని తుంగలో తొక్కి గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారేలా చేసింది. ప్రజలకు మద్యం తాగించడం ఖజానా నింపుకోవడం అనే విధానం రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడు, అందుకోసం అన్ని రకాల మద్యంపై ధరలు పెంచాడు అని హరీశ్రావు పేర్కొన్నారు.
మద్యం అమ్మకాలు పెరగాలని అధికారులపై ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నాడు. మద్యం అమ్మకాలు టార్గెట్ రీచ్ కాలేదని అధికారులకు మెమోలు ఇచ్చిన ఘనత రేవంత్ సర్కారుది. ఊరూరికి మైక్రో బ్రూవరీ తెచ్చి తాగుబోతుల తెలంగాణ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా రేవంత్ రెడ్డి? అడ్డదారులు తొక్కడం, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం తప్పదనే రీతిలో ఆనాడు బిల్డప్ ఇచ్చి ఈనాడు ఊరూరా మైక్రో బ్రూవరీలు తెస్తున్నాడు అని హరీశ్రావు దుయ్యబట్టారు.
మహిళలకు కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదు. యువతులకు నెలకు 2500 ఇస్తానని ఇవ్వలేదు. ఇవేమీ చేయకుండా బెల్ట్ షాపులు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నావ్. అప్పుల పాలైనా, గ్యారంటీల అమలు అయినా, మద్యం అమ్మకాలైనా ఏవైనా రేవంత్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి. గౌడ సోదరులకు వైన్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్లు అని ఊదరగొట్టి .. కేసీఆర్ ఇచ్చిన 15 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వడం లేదు. నీరాను ప్రోత్సహిస్తామన్నారు.. ఉన్న నీరా షాపును బంద్ చేసే కుట్ర చేశారు. వారం రోజుల్లో నష్టపరిహారం ఇస్తామని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి.. గీత కార్మికులు ప్రమాదావశాత్తు చనిపోతే ఇచ్చే నష్టపరిహారాన్ని ఇప్పటివరకు చెల్లించడం లేదు. గౌడన్నలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని హరీశ్రావు పేర్కొన్నారు.
రాత్రికి రాత్రే మద్యం షాపులు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే వెసులుబాటు ఎందుకు కల్పించారు ? పల్లెపల్లెకు మద్యం చేర్చడంపై ఉన్న శ్రద్ధ పల్లెపల్లెకు వైద్యాన్ని అందించడంపై లేదు. రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లను విచ్చలవిడిగా అనుమతించి మద్యం ఆదాయం పెంచుకోవాలనే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది. వందలకొద్దీ కొత్త బ్రాండ్లు వస్తున్నాయి అంటున్నారు, అడ్డగోలుగా బ్రాండ్లను పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారా..? యూరియా ఇవ్వరు కానీ ఊరి ఊరికో మద్యం దుకాణం ఇస్తాం తీసుకోండి అంటోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రేవంత్ రెడ్డి బరితెగింపు పాలనకు నిదర్శనం అని హరీశ్రావు పేర్కొన్నారు.
పబ్బులు, క్లబ్బుల గురించి గబ్బుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పబ్బులకు అనుమతి రద్దు చేయకపోగా కొత్త పబ్బులకు పర్మిషన్ ఇస్తూ కమిషన్లు దండుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి నువు ఓ యూ టర్న్ సీఎం. ఎన్నికల్లో చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తున్నది మరొకటి. మైక్రోబ్రూవరీల మూర్ఖపు ఆలోచన మానుకో రేవంత్ రెడ్డి అని హరీశ్రావు హెచ్చరించారు.