Harish Rao | హైదరాబాద్ : రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియాపై కేసులు పెడతారా..? అణిచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా..? అని కాంగ్రెస్ సర్కార్ను మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన టీ న్యూస్ ఖమ్మం రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం అని మండిపడ్డారు.
రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం. గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయం. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతు నొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వామీకం. జర్నలిస్ట్ సాంబశివరావుపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.