Harish Rao | హైదరాబాద్ : ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. రేవంత్ సర్కారుకి చేతకాకపోతే మేము వస్తాం.. ఢిల్లీకి పోదాం. ధర్నా చేద్దాం.. పదండి అని హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర సాగు, తాగు నీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సోయి లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అర్థం అవుతోంది. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్లు నములుతున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ భూములకు నీరు పారిస్తే… కాంగ్రెస్ నీళ్లు నములుతోంది. సాగర్ కుడి కాల్వ నుంచి రోజూ పది వేల క్యూసెక్కులు మూడు నెలలుగా పోతున్నా పట్టించుకోవడం లేదు. తాత్కాలిక వాటా అయినా 512 టీఎంసీలకు మించి 657 టీఎంసీలు తీసుకుపోయింది. 25 రోజుల్లోనే 65 టీఎంసీల నీటిని తరలించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణకు పెనుశాపంగా మారింది అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
నాగార్జున సాగర్ కేంద్ర బలగాల చేతిలో ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి లేకుండా ఏపీ ఇష్టారీతిన నీటిని తరలించుకుపోతోంది. కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదు, చంద్రబాబును అడిగే దమ్ము లేదు. ప్రతిపక్షాలను బాగా విమర్శిస్తారు… కానీ, కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదు. శ్రీశైలం, సాగర్ నీటిని తరలించుకుపోతుంటే కనీసం స్పందించడం లేదు. 1015 టీఎంసీల నీరు కృష్ణాలో ఈ ఏడాది వచ్చింది. ఏపీకి కేవలం 9 టీఎంసీల హక్కు మాత్రం ఉంది… ఇవాళ కూడా ఏపీకి నీరు తరలిస్తూనే ఉన్నారు. 220 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాడుకుంది… ఇంకా 123 టీఎంసీలు రావాలి. తెలంగాణ ఇప్పటికే నష్టపోయింది… ఇప్పటికైనా కళ్లు తెరవాలి అని హరీశ్రావు సూచించారు.
యాసంగి పంట కింద ఎన్ని ఎకరాలకు నీరు ఇస్తారో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. ఆరున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు ఏసుకున్నారు, సాగర్ ఎడమకాల్వకు ఇంకా నాలుగు తడులు కావాలి. హైదరాబాద్ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలు ఉన్నాయి. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏపీకి నీరు ఆపేలా చూడండి. కృష్ణా బోర్డు కార్యాలయం ముందు, దిల్లీలో ధర్నా చేద్దాం… మేమూ వస్తాం. సాగర్ కుడి కాల్వ, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు నుంచి నీరు వెళ్లకుండా అడ్డుకోవాలి. నీటి తరలింపు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది కాబట్టే… ఏపీ ఇష్టం వచ్చినట్లు నీటిని తరలించుకుపోతోంది అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం లేనందువల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నందువల్ల నీటిని తరలించుకునేందుకు చంద్రబాబుకు సులువు అయింది. ఇష్టం వచ్చినట్లు జలదోపిడీ జరుగుతోంది, ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఈ ఏడాది ఇవాళ్టి వరకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కృష్ణా బోర్డు కేంద్రం నియంత్రణలో ఉందా… ఏపీ నియంత్రణలో ఉందా… అన్న అనుమానం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. నీటిని తరలించుకుపోతుంటే శిలావిగ్రహాల్లా చూస్తున్నారు. అవసరమైతే అఖిల పక్షాన్ని దిల్లీకి తీసుకెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండి ఏం లాభం? కేంద్ర మంత్రిగా ఉండి నీళ్ళు తెస్తారా… చంద్రబాబుకు వత్తాసు పలుకుతారా? అని హరీశ్రావు ప్రశ్నించారు.
ప్రధాని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దాం. రాష్ట్రం కోసం ఉపయోగపడని పదవులు ఎందుకు? సందర్భాన్ని బట్టి స్పందించాలి. నాగార్జున సాగర్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు ఉపసంహరించాలి, లేదంటే శ్రీశైలంలో కూడా పెట్టాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుట్వానికి చేత కావడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా చూడాలి. ప్రాజెక్టులకు అనుమతులు తేవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. 15 నెలలు అయినా ప్రాజెక్టులకు అనుమతులు తేవాల్సింది… డీపీఆర్లు వెనక్కు వచ్చినా పట్టించుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టారు, ఆర్నెళ్లలో మరమ్మత్తులు పూర్తి చేసే అవకాశం ఉన్నా చేయడం లేదు. ఏపీ యథేచ్చగా నీరు తీసుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరడం కాదు… ఇప్పుడు పోతున్న నీటి గురించి మాట్లాడాలి, కేంద్ర మంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే బాగుంటుంది. కేసీఆర్ ప్రతినిత్యం సమీక్ష చేసేవారు… ఇప్పుడు సీఎం, మంత్రి కనీసం పట్టించుకోవడం లేదు. గత పాలకుల పుణ్యం కారణంగానే తెలంగాణకు 299 టీఎంసీల తాత్కాలిక కేటాయింపు జరిగింది. తెలంగాణకు 575 టీఎంసీల నీరు తెచ్చుకునేందుకు సెక్షన్ 3 దోహదపడుతుంది. కేవలం నిర్లక్ష్యం, వైఫల్యం, లొంగిపోయిన కారణంగానే నీటి దోపిడి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య పరోక్ష సంబంధం… గురు దక్షిణ చెల్లించుకుంటున్నారేమో? రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలి, మేమూ కలిసి వస్తాం అని హరీశ్రావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Doctor | విషాదాంతమైన విహారయాత్ర.. ఈత కొట్టేందుకు నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలు
KCR | ఏఐజీ హాస్పిటల్కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!
Telangana | త్వరలో 20 శాతం పెరగనున్న మద్యం ధరలు.. చీప్ లిక్కర్పై సుంకాలు తగ్గించే యోచన లేనట్టే!