Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు బీసీలపై కపటి ప్రేమ కురిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయి.. బీసీలను అవమానిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు? పార్లమెంట్లో బీజేపీకి 240 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీల బలం ఉంది. రిజర్వేషన్ల బిల్లు పెంపును అడ్డుకునేది ఎవరు? ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేదు. బీజేపీ అయితే ఏకంగా జనగణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నది. గడిచిన 35 ఏళ్ళల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బిజెపి 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బీసీలపై కపట ప్రేమతో నటిస్తున్నాయని హరీశ్రావు తెలిపారు.
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తిచేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదు. ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు. “Jitani Abadi Utna haq” అని నినదించే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదు? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు మిగతా బీజేపీ ఎంపీలు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు? రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారు అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది. ఎలాంటి పోరాటానికైనా బిఆర్ఎస్ కలిసి వస్తుంది. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బిజెపి లను డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.