Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది. అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్ గొంతు నొక్కడం. జగదీశ్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు సస్పెండ్ చేస్తారా. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సభ్యులు మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారిని వారిని అదుపు చేసి సభా పెద్దగా శాసనసభను క్రమంలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్గా ప్రసాద్ను ప్రతిపాదించినప్పుడు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది అని హరీశ్రావు గుర్తు చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పార్టీ పేరు పెట్టింది కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా 10 లక్షల దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది కేసీఆర్. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. బాబా సాహెబ్ అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబు జగ్జీవన్ రావు కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే వారు కొత్త పార్టీ పెట్టుకున్న విషయం కూడా అందరికి తెలుసు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అధీర్ రంజన్ చౌదరి, సోనియా గాంధీ.. ద్రౌపది ముర్మును అవమానించారని హరీశ్రావు గుర్తు చేశారు.
స్పీకర్కు, శ్రీధర్ బాబుకు బీఆర్ఎస్ పక్షాన శాసనసభ్యులను వెళ్లి వివరణ ఇవ్వడం జరిగింది. జగదీష్ రెడ్డి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అలా మీరు భావిస్తే రికార్డులను చూపించాలని కోరాం. సభ జరగాలి కాబట్టి మా తప్పు ఉన్నట్లయితే మేము క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పాము. ఈరోజు ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలని కోరామని హరీశ్రావు పేర్కొన్నారు.
ఉరి తీసేటప్పుడు కూడా మీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. సస్పెండ్ చేసిన సభ్యుని వివరణ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పు చేయకపోయినా సభలో క్షమాపణ చెప్తామని కూడా చెప్పాము. పథకం ప్రకారం ముందే అనుకొని బీఆర్ఎస్ సభ్యుని సస్పెండ్ చేశారు. ప్రశ్నించే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను కుట్రపూరితంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్రావు ధ్వజమెత్తారు.
స్పీకర్పై జగదీశ్ రెడ్డి ఏక వచనం వాడకపోయినా ఏక వచనం వాడారని సస్పెండ్ చేయడం దుర్మార్గం. కౌల్ అండ్ శక్దర్ పుస్తకంలో ఎక్కడ కూడా (యు) నీ అనే పదాన్ని నిషేధించలేదు. అయినా సరే మేము ఎక్కడ స్పీకర్ను ఏకవచనంతో సంబోధించలేదు. రాహుల్ గాంధీ మీరు చెప్పే ప్రజాస్వామ్య పరిరక్షణ ఇదేనా. ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అంటే. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మంత్రి శ్రీధర్ బాబు యాక్షన్ నడుస్తుంది అని హరీశ్రావు నిప్పులు చెరిగారు.