Harish Rao | హైదరాబాద్ : పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు తప్ప.. మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో తప్పేముందని హరీశ్రావు ప్రశ్నించారు. శాసనసభలో విద్యుత్ రంగ పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ ప్రజలు కరెంట్ బిల్లులు కట్టలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని వ్యాఖ్యానించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలపై క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దండం పెడుతా మైక్ కట్ చేయకండి. సిద్దిపేట, గజ్వేల్, ఓల్ట్ సిటీ ప్రజల మీద సీఎం అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. సిద్దిపేటలో, గజ్వేల్, ఓల్ట్ సిటీలో కాంగ్రెస్ గెలవలేదనే బాధలో రేవంత్ ఉన్నారు. దాంతో బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదాన్న ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో, ఒక ఇండస్ట్రీయలిస్ట్ ఎవరన్న కట్టకపోతే, ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప.. నియోజకవర్గ ప్రజలను బద్నాం చేయడం సబబు కాదు అని సీఎం రేవంత్కు హరీశ్రావు సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో, టీడీపీతో, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. అవును మేం పొత్తు పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని, తెలంగాణ ఇస్తామని కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టి, రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేశారు కాబట్టే ఆ రోజు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. మేం టీడీపీతో, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా.. ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. ఈ రాష్ట్ర, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి తెలంగాణ సాధించాం. మా ప్రయత్నం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మేం సక్సెస్ అయ్యాం. రాష్ట్రాన్ని సాధించాలనే వ్యూహంలో భాగంగానే పొత్తులు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం పార్టీలు మారిండు తప్ప.. మేం అలా చేయలేదు. మేం ఇతర రాజకీయ పార్టీలతో తెలంగాణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను అవమానపరిచారు సీఎం. విజ్ఞులైన ప్రజలు మా అభ్యర్థి మాగంటి గోపీనాథ్ను గెలిపించారు. ఎంఐఎం పోటీలో ఉండటంలో వల్లే ఆయన గెలిచారని సీఎం మాట్లాడటం సరికాదు. జూబ్లీహిల్స్ ప్రజలను అవమానపరిచే విధంగా సీఎం మాట్లాడటం సరికాదన్నారు హరీశ్రావు.