సిద్దిపేట : రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్లో రూ.15 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా టీకాలు రెండో డోస్ కూడా అందరూ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాలలో మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గర్భిణులు కరోనా టీకాలు తీసుకోవద్దనే అపోహలు వద్దన్నారు. అందరూ తీసుకోవచ్చునని వైద్యులే చెబుతున్నారు. మీరు కోరితే మీ ఇంటింటికి వచ్చి కరోనా టీకాలు వేయిస్తామని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.
గణేష్ నగర్ మహిళా భవన నిర్మాణం పదేళ్ల పంచాయతీ ఇవాళ్టితో నెరవేరిందని, ఇంకా అదనంగా కాంపౌండ్ వాల్ కోసం కావాల్సిన నిధులు, 6వ వార్డులో మహిళా భవనం మరమ్మతులకు అవసరమైన నిధులు సమకూర్చి 3 నెలల్లోపు పూర్తి చేస్తామని ఆయా వార్డు ప్రజలకు మాట ఇచ్చారు.
విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని, రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో పట్టణంలో తాగునీటి గోస తీవ్రంగా ఉండేదని, ఇవాళ మిషన్ భగీరథతో నీటి కష్టాలకు చెక్ పడిందన్నారు.
వార్డుల్లో యూజీడీ పనులు వెంటనే చేయించాలని అధికారులను ఆదేశిస్తూ.., నల్లా నీళ్ల తరహాలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేలా గ్యాస్ పైపు లైన్లు వేయిస్తున్నామన్నారు. తొందరగా పైపు లైన్లు పనులు పూర్తి చేయించి, రోడ్లు వేసుకుందామని ప్రజలకు మంత్రి వివరించారు. యూజీడీ కోసం ప్రజలు సహకరించాలని, దీంతో దోమలు, ఈగలు, రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు.
ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఆరోగ్యంగా ఉండేందు కోసం యోగా, వాకింగ్ చేయాలని ప్రజలను కోరారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం త్వరలోనే కల్పిస్తామని చెప్పారు. తడి, పొడి, హానికరమైన చెత్తలను వేర్వేరుగా ఇచ్చి స్వచ్ఛ సిద్దిపేటకు సహకరించాలని కోరారు.
అలాగే సిద్దిపేట బురుజు వద్ద ఏర్పాటైన స్వచ్ఛ బడికి పోవాలని, అక్కడ చెత్త ద్వారా ఎరువు తయారు చేసే విధానం, చెత్తతో అనర్థాలు, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు వివరిస్తారని, ప్రజలు అవగాహన పొంది స్వచ్ఛ సిద్దిపేటకు సహకారాన్ని అందించాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, స్థానిక కౌన్సిలర్ సద్ది నాగరాజు, కెమ్మ సారం ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఈఈ వీర ప్రతాప్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.