JP Nadda | హైదరాబాద్, జూన్ 25 ( నమస్తే తెలంగాణ): తెలంగాణకు రావడం, కండ్లారా అభివృద్ధిని చూసి కూడా కడుపుమంటతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. ఆదివారం నాగర్కర్నూల్లో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సంప్రదాయాన్నే కొనసాగించి, నవ్వుల పాలయ్యారు. దేశమంతా అభివృద్ధి చెందుతుంటే తెలంగాణ మాత్రం వెనుకబడిపోయిందంటూ అపరిపక్వ వ్యాఖ్యలు చేసిన నడ్డా.. ముందుగా గణాంకాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని విశ్లేషకులు హితబోధ చేస్తున్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఏ రాష్ట్రం ఉన్నది? వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి ఏమిటి? తదితర అంశాలను అధ్యయనం చేసి ఉండాల్సిందని నిపుణులు సూచిస్తున్నారు.
నిజంగా తెలంగాణ వెనుకబడిపోతే కేంద్ర ప్రభుత్వం పలు జాతీయ స్థాయి అవార్డులు ఎందుకు ఇస్తున్నదో నడ్డా వివరించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వలేదని విమర్శించే ముందు కొల్లూరుకు వెళ్లి రావాలని సూచిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ హౌజింగ్ కాలనీని సందర్శిస్తే పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధి, సీఎం కేసీఆర్ సంకల్పబలం తెలుస్తుందని చెప్తున్నారు. దేశంలో పేదరికాన్ని తగ్గించామని గప్పాలు కొడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. కేంద్రం అన్ని రకాల నిత్యాసర వస్తువుల ధరలను అడ్డగోలుగా పెంచి ప్రజలను దోచుకుంటున్నది వాస్తవం కాదా? ధరల భారంతో మధ్య తరగతి ప్రజలు పేదలుగా, పేదలు నిరుపేదలుగా మారుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్న నడ్డా.. ఏ అంతర్జాతీయ స్థాయి సూచీలో భారత్ను అగ్రగామిగా నిలబెట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
నాగర్కర్నూల్లో నిర్వహించిన సభకు పలువురు బీజేపీ ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. పార్టీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సభకు హాజరుకాలేదు. దీనిని బట్టి వారిద్దరూ బీజేపీని వీడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎంపీ ధర్మపురి అర్వింద్తోపాటు ఎమ్మెల్యే రఘునందన్రావు సైతం సభకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో లుకలుకలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి సాక్షిగా బయటపడ్డాయని అంటున్నారు. నేతల మధ్య అగాధం పూడ్చలేనంత స్థాయికి చేరిందని, జాతీయ అధ్యక్షుడు కూడా చేతులెత్తేశాడని చెప్పుకుంటున్నారు.