గజ్వేల్ అర్బన్: అక్టోబర్ 26 : సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీకి అనుకున్నంత సీన్ లేదని మరోసారి రుజువైంది. బీజేపీ గజ్వేల్ టికెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్కు గురువారం తొలి సభలోనే షాక్ తగిలింది. రోడ్షో మొదలు సభ వరకు జనం లేక వెలవెలబోయింది. శామీర్పేటలోని తన నివాసం నుంచి బయలుదేరిన ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుతోపాటు పార్టీ నాయకులకు వంటిమామిడి వద్ద బీజేపీ నాయకులు గజ్వేల్ నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. గజ్వేల్ పట్టణానికి చేరుకున్న ఈటల రాజేందర్, బీజేపీ ముఖ్య నాయకుల చుట్టూ ఆ పార్టీ కార్యకర్తలు తప్ప జనం కన్పించలేదు.
గజ్వేల్ సభలోనూ పార్టీ శ్రేణులతోపాటు వచ్చిన వృద్ధులు, మహిళలు వెంట వెంటనే వెళ్లిపోయారు. ఈటల మాట్లాడుతున్న సమయంలోనూ జనం కన్పించలేదు. సభకు 10 వేల మంది వస్తారన్న అంచనా వేసిన ఏర్పాట్లు చేసినా.. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కాగా, సభలో ప్రసంగించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రజల రక్షణకు ఎల్లవేళలా శ్రమిస్తున్న పోలీసులను ఖాసీం రజ్వీ సైన్యం అంటూ రజాకార్లు అనే అర్థం వచ్చేలా వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రజ్ఞాపూర్ వద్ద ర్యాలీగా వస్తున్న క్రమంలో ప్రజ్ఞాపూర్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలని స్థానికులు కోరితే అందుకు విముఖత చూపారు. దీంతో ప్రజ్ఞాపూర్లో సబ్బండవర్గాలు కొంత బాధపడటం కన్పించింది. పలువురు బీజేపీలో చేరిగా, వారికి అక్కడ అవమానమే జరిగింది. సభావేదికపై అనుకున్నంతగా గౌరవం దక్కలేదు.