హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ‘వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి రైతుల గోస తీర్చాలన్నదే బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ఆరాటం. అందుకే మూడు నెలలు ఇరిగేషన్ మంత్రిగా అవకాశమిస్తే చేసి చూపుతానని సవాల్ విసిరారు. 24గంటలు దాటినా చేతగాని మంత్రులు ఆ సవాల్ను స్వీకరించలేదు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పెద్దలకు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే వెంటనే వృథాగా పోతున్న జలాలను ఒడిసిపట్టాలని డిమాండ్ చేశారు.
హరీశ్ సవాల్ను స్వీకరించే దమ్ములేని మరికొందరు కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు గోసుల శ్రీనివాస్, అభిలాశ్ రంగినేని, వాసుదేవారెడ్డి, సుమిత్రా ఆనంద్, దూసరి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ కోసం హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో బ్రోకర్ పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలకు హరీశ్రావు గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కిడిదని ప్రశ్నించారు. మహారాష్ట్రతో 152 మీటర్ల ఎత్తులో తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి అగ్రిమెంట్ జరిగిందని సీఎం, మంత్రులు లీకులిస్తున్నారని, ఆ ఒప్పందం నిజమైతే తెలంగాణ ప్రజల ముందు దానిని బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్కు స్కామ్లు తప్ప ప్రాజెక్టులు, పథకాలపై ధ్యాసేలేదని దెప్పిపొడిచారు. అందుకే పరిజ్ఞానమే లేని టెక్నీషియన్తో దేవాదుల పంప్హౌస్ను ఆన్చేసి విఫలమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్కు మేడిగడ్డ మరమ్మతుపై ఎలాంటి ప్రణాళికలేదని విమర్శించారు.
‘హరీశ్రావు కాలిగోటికి కూడా సరిపోని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి గడ్డం పెరిగింది కానీ, బుర్ర పెరుగలేదు. మూడేండ్లలో మూడు పార్టీలు మారిండు. అందుకే సంగారెడ్డిలో ఇక గెలువనని తెలిసి పోటీ చేయనంటూ పారిపోతున్నడు’ అంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
సంగారెడ్డిలో హరీశ్రావు అడుగుపెడితే ఏదో చేస్తామంటూ ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రెండేండ్ల కిందట కొట్టిన దెబ్బకు ఇంకా తేరుకోని ఆయన మతిలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో.. గోదావరి ఎక్కడి నుంచి పారుతుందో తెలియని జగ్గారెడ్డి.. ప్రాజెక్టులు నింపితే భద్రాచలం కొట్టుకుపోతుందని మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 2009లో తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేస్తే జగ్గారెడ్డి వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు.