Errolla Srinivas | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అద్దంకి దయాకర్ కాదు.. అడ్డంకి దయాకర్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్.. కరప్షన్ అంటే కాంగ్రెస్ అని విమర్శించారు. కరప్షన్కు కాలేజీ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిలబస్ అవుతదని ఎద్దేవా చేశారు.
హ్యామ్ రోడ్లలో 25 శాతం ఎక్సెస్ టెండర్లు ఇచ్చారని అడుగుతున్నామని తెలిపారు. అది నిజామా కాదా బయటపెట్టాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్పై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మైనింగ్పై మేం ఆధారాలతో సహా బయటపెట్టామని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అవినీతి చేసుకుంటూ మాపై నిందలా అని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో అవినీతి జరుగుతోందని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు బూతులు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. బీజేపీ అవినీతిపై రాహుల్ గాంధీ రోజూ విమర్శలు చేస్తున్నారని.. మోదీ, అదానీ దగ్గర రాహుల్ ఎంత కమీషన్ తీసుకుంటున్నారా చెబుతారా అని ప్రశ్నించారు. కమీషన్లు తీసుకునే నీచమైన సంస్కృతి కాంగ్రెస్ది అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కమీషన్లు, కాంట్రాక్టులు మీకు.. నిందలు మాపై వేస్తారా అని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక శాఖలో భట్టి ట్యాక్స్, ఇరిగేషన్ శాఖలో ఉత్తమ్ ట్యాక్స్, ఎక్సైజ్లో జూపల్లి ట్యాక్స్, రవాణా శాఖలో పొన్నం ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. మంత్రుల ఛాంబర్ల దగ్గర సెక్యూరిటీ పెట్టుకునే దుస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ అసలు పేరు స్కాంగ్రెస్ అని అన్నారు. గాంధీభవన్ నుంచే కుంభకోణాల చరిత్ర నడుస్తోందని విమర్శించారు.