రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత 125 అడుగుల విగ్రహ ప్రాంగణానికి కనీసం గేట్లు కూడా తీయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇందుకు కారకులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ఆకాశం అంత ఎత్తుకు ఎత్తితే కాంగ్రెస్ ప్రభుత్వం అవమానాలకు గురిచేస్తుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని అన్నారు. బీఆర్ అంబేద్కర్, పూలే వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ సర్కార్ అనేక కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీఆర్ అంబేద్కర్ దళితుల అభ్యున్నతి కోసం పాటు పడితే కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల విచ్ఛిన్నానికి పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ 1100 గురుకులాలను ప్రారంభించి, విదేశాల్లో చదివే దళిత విద్యార్థులకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దళిత జనోద్ధరణ కోసం కేసీఆర్ దూరదృష్టితో దళితబంధు పథకాన్ని తెస్తే ఆ పథకాన్ని దురుద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసిందన్నారు.