Errolla Srinivas | హైదరాబాద్ : ఇవాళ తెలంగాణలో తెలుగు దేశం మాస్కు వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అని బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది రాజకీయ పునరేకీకరణ కాదు. పాత తెలుగు తమ్ముళ్ల పునరేకీకరణ.. వారంతా ఒక వేదిక మీదకు వస్తున్నారు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు డైరెక్షన్లో ఈ చేరికలు నడుస్తున్నాయి. పోరాటాలు, ఉద్యమాలు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు కొత్తకాదు. భయపడేది లేదు అని ఎర్రోళ్ల శ్రీనివాస్ తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ నాయతక్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి జరిగింది.. అసలు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనే గిట్టదని చెప్పిన కడియం శ్రీహరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవడం విడ్డూరంగా ఉందని శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం అన్ని పదవులు అనుభవించారు. ఒక ముఖ్యమంత్రి పదవి మాత్రమే రాలేదు. రాజకీయం అంటేనే ఒక రైలు డబ్బాలాంటింది. ఎక్కేటోడు ఎక్కుతాడు దిగేటోడు దిగుతాడు. కానీ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నామని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శ్రీనివాస్ గుర్తు చేశారు. పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అని రేవంత్ అన్నారు. పదవులకు రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అన్నారు. రాజీనామాలు చేయకుండా పార్టీలో చేరితే ఆ నాయకుల ఇండ్ల ముందు చావు డప్పులు కొట్టిస్తాం అన్నాడు రేవంత్. మరి ఇవాళ పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ ఈ రెండు బాధ్యతలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రెండు పనులు పూర్తయ్యాకనే కాంగ్రెస్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.