చేర్యాల, మార్చి 5 : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దేవాదుల నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కాల్వలు ఎండిపోతున్నాయి. బోరుబావులు వట్టిపోయి వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతుండడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ఫిబ్రవరి మాసంలో 1.8మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ నాలుగు మండలాల పరిధిలో ఫిబ్రవరి మాసంలో రైతులు 600 బోర్లు తవ్వించినట్లు సమాచారం. 500 నుంచి 600 ఫీట్ల వరకు బోరు వేసినా చుక్క నీరు పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారు.
నీళ్లు రాని రైతుల పరిస్థితి చూస్తే తమకే బాధ అనిపిస్తున్నదని బోరువెల్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన రాంరెడ్డి అనే రైతు సాగుచేసుకున్న 5 ఎకరాల వరి పొలంలో రెండున్నర ఎకరాలను వదిలిపెట్టుకోవడమే కాకుండా ఎండిన పొలంలో పశువులను మేపుతుండడం గమనార్హం. తలాపున తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా ఆశించిన నీటిమట్టం లేకపోవడంతో ఈ ఏడాది చెరువులు నింపే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాదితో పోలిస్తే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో పంటల సాగు సైతం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. రంగనాయక్సాగర్ నుంచి చేర్యాల, ధూళిమిట్ట మండల్లాలోని కొన్ని గ్రామాలకు కాల్వల ద్వారా గోదావరి జలాలు వస్తుండగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోని కాల్వల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి.