వరంగల్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): మాతృభూమి రుణాన్ని కొంతైనా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు. తల్లి పేరుతో మొదలుపెట్టిన యశోద హాస్పిటల్స్ గ్రూపు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రం గా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్రావు, గోరుకంటి సురేందర్రావు, గోరుకంటి దేవేందర్రావులు సొంతూరికి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కటిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లి-రాంపూర్ వీరి సొంతూరు. ఆరేండ్ల క్రితమే కోటి రూపాయల విలువైన స్థలాన్ని పంచాయతీకి అందజేశారు. ఈ క్రమంలో ఊరికి అవసరమైన వాటిని నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. యశోద చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో యశోద సేవా కేంద్రా న్ని నిర్మించారు. మెగా ఫంక్షన్ హాల్-సిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇందులో ఉన్నాయి. అందరూ వినియోగించుకునేలా వీటిని తీర్చిద్దారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బుధవారం వీటిని ప్రారంభించనున్నారు. ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది. కంప్యూటర్ ట్రైనిం గ్ సెంటర్లో శిక్షణ పొందితే మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేలా ఇక్కడ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలతోపాటు చుట్టుపకల గ్రామాల వారికి, అన్ని వర్గాల వారికి, నిరుద్యోగులకు, అనాథల కు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఇక్క డ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. తాజాగా ప్రారంభించే నిర్మాణాలతోపాటు మేడిపల్లి-రాంపూర్లో నిత్యం ప్రజలకు పూర్తిస్థాయిలో హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు కూడా ఫౌండేషన్ సన్నాహాలు చేస్తున్నది.
అందరి కోసం..
యశోద సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా యువత తయారవుతా రు. మేడిపల్లి-రాంపూర్ ప్రజలు, చుట్టుపకల ప్రాంతాల్లోని వారు ఎవరైనా వేడుకలకు, ప్రజోపయోగ కార్యక్రమాలకు మెగా ఫంక్షన్ హాల్ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. చారిటబుల్ ఫౌండేషన్ తరపున అనాథ, నిరుపేద యువత వృత్తిపరమైన – సామాజిక నైపుణ్యాలతో శిక్షణ పొందవచ్చు. మహిళలు టైలరింగ్ నేర్చుకొని ఉపాధి పొందవచ్చు. – జీ దేవేందర్రావు, యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్