పాలకుర్తి, జూన్ 7 : ‘దయన్నా.. వడ్లు కాంటా అయితలే.. రెండు నెలలైనా పట్టించుకునే దిక్కు లేదు.. ఎండలకు ఎండి, వానలకు నానుతున్నం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నం.. ఎమ్మెల్యే వస్తలేడు.. అధికారులు పట్టించుకుంటలేరు.. కేసీఆర్ పాలనే బాగుండే.. మళ్లీ మీరే రావాలి.. కాంగ్రెస్ పాలనలో రైతులకు చావే శరణ్యం’ అంటూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఫోన్ చేసి ఆవేదన చెందారు. దీంతో స్పందించిన ఎర్రబెల్లి తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వడ్ల కాంటా కోసం ఎర్రటి ఎండలో రైతులను ఇబ్బందులు పెడుతున్న సీఎం రేవంత్రెడ్డికి వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు.
రేవంత్రెడ్డి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు. ఎరువుల కోసం రైతులు కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ధాన్యం అమ్మడానికి పడరాని పాట్లు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నాడూ లేనివిధంగా రైతులను ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ సర్కార్కు తగదని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు రైతుల బాధలు పట్టవా? అని మండిపడ్డారు. దమ్ముంటే కొనుగోలు కేంద్రాలకు రావాలని సవాల్ విసిరారు. లారీలు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తరుగు పేరుతో దోపీడీ చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతుల వద్ద కాంటా కోసం పైసలు వసూలు చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు పూర్తికాకుంటే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.