జనగాం : మునుగోడు ప్రజలు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చారని అన్నారు. మంగళవారం జనగాం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యలతో కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్, అమిత్ షా చెప్పులు మోశాడు కాబట్టే ఢిల్లీ వరకు తెలిసేటట్లు మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. బీజేపీ రాజగోపాల్ రెడ్డిని రూ. 18 వేల కోట్లకు కొని ఆయనను బలి పశువును చేసిందని ఆరోపించారు. ఎన్నికల కోసం హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని, వరంగల్ భద్రకాళి ఆలయం, మునుగోడు ఉప ఎన్నిక కోసం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని నాటకం ఆడారని మంత్రి విమర్శించారు. మునుగోడు ప్రజలు వారి నాటకాలకు తెరదించారని తెలిపారు. మునుగోడులో బీజేపీ ఇచ్చిన హామీలను దేశమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పెద్దల అహంకారంపై విజయం
భారత దేశాన్ని బంగారుమయం చేయడానికి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని మునుగోడు ప్రజలు తమ తీర్పుతో దీవించారు. మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు మునుగోడు అభివృద్ధికే కాకుండా దేశ రాజకీయాల్లోనూ కీలక మలుపని తెలియజేశారు ఎర్రబెల్లి. మనుగోడు విజయాన్ని కుట్రలు కుతంత్రాలు, ఢిల్లీ పెద్దల అహంకారంపై విజయంగా, ఎమ్మెల్యేల కొనుగోలును నిలదీసిన నిఖార్సైన తెలంగాణ విజయంగా మంత్రి అభివర్ణించారు.
ధరల పెరుగదలకు బీజేపీనే కారణం
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి అనుమతులు తేలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సిగ్గు లేదు. కరీంనగర్లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అని మంత్రి విమర్శించారు బీజేపీ ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని అన్నారు. ధరలు పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణం అని దుయ్యబట్టారు.
బీజేపీ తెలంగాణకు శత్రువు
తెలంగాణలోని 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలపడం, రాష్ట్ర విభజన హమీలు విస్మరించడం, కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వకపోవడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోతవిధించడం బీజేపీ కుట్రకు నిదర్శనమని ఎర్రబెల్లి అన్నారు. బీజేపీ డబ్బులిచ్చి ఎమ్మేల్యేలను కొనాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బియ్యం కొనమంటే, తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గొయల్ అంటారని, ఉచితంగా 24గంటలు కరెంటు ఇస్తుంటే, మోటర్లకు మీటర్లు పెడతామంటారని మంత్రి ఆరోపించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, జిల్లాకో నవోదయ స్కూల్ హామీల సంగతేంటని ఎర్రబెల్లి బీజేపీని దుయ్యబట్టారు. 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని, ఐటిఐఆర్ మంజూరు చేయలేదని, బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ రైలు కూడా అంతే సంగతులని మంత్రి అన్నారు.
దేశానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష
తలసరి ఆదాయం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమలు.. ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్గా ఉందని మంత్రి అన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనే దేశానికి శ్రీరామ రక్ష అని, కేసీఆర్ ఉన్నంత కాలం బీజేపీ నేతల ఆటలు సాగవవని ఎర్రబెల్లి హెచ్చరించారు.