హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని, ఓ ఎన్నారైని మోసం చేసినట్టు కొందరు ఎన్నారైలు సాయం అడిగితే పోలీసులను కలవాలని సూచించానని తెలిపారు. తనకు ఫోన్ట్యాపింగ్కు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘శరణ్ చౌదరి అక్రమాలు తెలిసి బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అనేక మందిని మోసం చేశాడు. నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నారైలను తన దగ్గర పెట్టుబడులు పెట్టాలని కోరాడు. ఎన్నారై విజయ్ దగ్గర రూ.5 కోట్లు వసూలు చేశాడు.
వందల ఎకరాల్లో భూములు ఉన్నాయని దొంగ పత్రాలు చూపించి మోసం చేశాడు. విజయ్కు భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవటంతో పలువురు ఎన్నారైలతో కలిసి విజయ్ నా దగ్గరికి వచ్చారు. హైదరాబాద్ సీపీని కలవాలని సూచించా. పోలీసుల విచారణలో శరణ్ చౌదరి దగ్గర భూమి లేదని తెలిసింది. రూ.5 కోట్లు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదని వెల్లడైంది. రూ.3 కోట్ల విలువైన శరణ్ ఫ్లాట్ను విజయ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. శరణ్ చౌదరిపై అనేక కేసులు ఉన్నాయి. ఆయన భార్య పాస్పోర్ట్ను కూడా సీజ్ చేశారు. అనేకమందికి డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. ఇలాంటి వారిని ఎవరూ సమర్థించరు. విజయ్ అనే వ్యక్తిది విజయవాడ. ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు, నాకు ఎలాంటి బంధుత్వం లేదు. నా జీవితంలో ఏనాడూ భూముల జోలికి పోలేదు.
నా రాజకీయ జీవితంపై ఇంతవరకు ఎలాంటి మచ్చలేదు’ అని వివరించారు. గతంలోనూ తనను ప్రభుత్వాలు అనేక ఇబ్బందులకు గురి చేశాయని, అయినా ఏనాడూ లొంగలేదని తెలిపారు. గతంలో బాబ్లీ ప్రాజెక్టు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. ప్రణీత్రావు ఎవరో తనకు తెలియదని అన్నారు. ‘ఆయనది నాది ఒకే గ్రామం కాదు. వారి బంధువులు మా గ్రామంలో ఉంటారు. ఆయనను నేను ఏనాడూ కలవలేదు. పరిచయం కూడా లేదు. బంధువు కాదు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేసుకోవచ్చు. ప్రణీత్రావు కుటుంబానిది ఏ పార్టీనో తెలుసుకోవాలి’ అని వెల్లడించారు. పార్టీ మారాలని తనను ఒత్తిడి చేస్తున్న మాట వాస్తవమేనని, కానీ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై శరణ్చౌదరి చేసిన ఆరోపణలను విజయ్ ఖండించారు. వీడియో సందేశం ద్వారా జరిగిన ఘటనను ఆయన వివరించారు. ‘నాకు నేరుగా దయాకర్రావు తెలియదు. పలువురు ఎన్నారైల ద్వారా ఆయనను కలిశా. మా సమస్య విన్న ఆయన హైదరాబాద్ సీపీని కలవాలని సూచించారు. నేను అప్పటి సీపీ సీవీ ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశా. శరణ్ ఫ్లాట్ను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దాని మీద ఉన్న రూ.1.2 5కోట్ల బ్యాంక్ లోన్ కట్టా. అతడి వద్ద నుంచి ఇంకా రూ.2 కోట్లు రావాల్సి ఉన్నది. ఇవన్నీ దాచి కొత్త నాటకానికి తెర తీశారు. కొద్దికాలం క్రితమే దుబా య్ పారిపోయాడు. మీడియా, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. శరణ్ చౌదరి పలువురికి ఇచ్చిన చెక్లు బౌన్స్ అయ్యాయి. ఎన్నారైలనుమోసం చేశాడు’ అని పేర్కొన్నారు.