నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 26: కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాకముందు సమైక్య పాలనలో నీళ్లు, కరెంటు కోసం ఎన్ని తిప్పలు పడ్డామో ఒకసారి గుర్తుచేసుకోవాలని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కష్టాలు ఎలా తీరాయో గమనించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉందో, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏ స్థాయిలో అభివృద్ధి సాధించిందో గమనించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల సూచించారు.
గతంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా వెనక్కి నెట్టివేశాయని విమర్శించారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి తెలంగాణలో ఈ తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించినట్టు తెలిపారు. శుక్రవారం పలు జిల్లా ల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. కరీంనగర్లోని రేకుర్తిలో జరిగిన సమ్మేళనంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు తెలంగాణను ఏం అభివృద్ధ్ది చేశాయని నిలదీశారు. వారిని నమ్మితే మరోసారి తెలంగాణను గుడ్డి దీపం చేస్తారని విమర్శించారు.
ఆర్మూర్ అభివృద్ధి బాధ్యత మాది: వేముల
సీఎం కేసీఆర్ నాయకత్వంలో జనరంజక పాలన అందుతున్నదని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో నిర్వహించిన సమ్మేళనంలో మంత్రి వేముల మాట్లాడుతూ.. ఆర్మూర్ అభివృద్ధిని తమకు వదిలేయాలని, జీవన్రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ.. నిన్న ఉద్యమ నేతగా, నేడు అభివృద్ధి ప్రదాతగా చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. సమ్మేళనం లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ లాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 80 లక్షల మంది బలగం బీఆర్ఎస్కు ఉన్నదని తెలిపారు. కాగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో రంగశాయిపేటలో నిర్వహించిన సమ్మేళనంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.