దేవరుప్పుల, నవంబర్ 5: సన్నధాన్యానికి రూ.500 బోనస్ దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా చాలు .. ఇదే పదివేలని రైతులు అనుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao)అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించగా, రైతులు తమ గోడును వినిపించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎంతో ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు(Grain purchases) కేంద్రాలను ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా నేటికి కొనుగోళ్లు జరగడం లేదని విమర్శించారు. రైతులు ఇప్పటికే రేవంత్రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై నమ్మకాన్ని కోల్పోయారని, సన్నధాన్యంపై బోసన్ ఇస్తారనే నమ్మకం రైతులకు లేదన్నారు.
రైతులు ఇప్పటికే తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి వారం రోజులు దాటుతు న్నదని, కళ్లాల్లోనే వానలకు తడిచి, కావలికాయలేక ఆగమాగం అవుతున్నారన్నారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వాడుకుని లబ్ధి పొందిన రైతులు నేడు ఇదెక్కడి ప్రభుత్వమని తలలు పట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సన్న వడ్లకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా అమలయ్యే వరకు రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతామని ఆయన హెచ్చరించారు.