హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుంది. ఏటా నమోదు గణనీయంగా పడిపోతుంది. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లపై మోజుపై సర్కార్ బడుల్లో చేరేవారు కరువయ్యారు. అటు తల్లిదండ్రు లు, ఇటు విద్యార్థుల్లో సర్కారు బడుల పట్ల నమ్మకం సన్నగిల్లుతున్నది. మరీ ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్లు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి.
పలు ప్రాంతాల్లో విద్యార్థులు చేరక మూసివేత దిశలో సాగుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో జీరో ఎన్రోల్మెంట్ బడులు అక్షరాలా 1,739. నిరుడుతో పోల్చితే ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా 432 స్కూళ్లల్లో నమోదు సున్నా. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ బడుల్లో చేరలేదు. సర్కారు బడుల్లో మొత్తం 23 లక్షల మంది విద్యార్థులుండగా, ఈ ఏడాదికి వచ్చేసరికి 20 లక్షలకు పడిపోయింది. అంటే ఈ ఏడాది కాలంలో మూడులక్షల విద్యార్థులు తగ్గిపోయారు. బడిబాట వంటి కార్యక్రమాలను నిర్వహించినా ఫలితాలు రావడంలేదు. నమోదు పెరగడంలేదు.