హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం బోధన లభిస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్లకు బైబై చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. వీరిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి ఇప్పటివరకు 6,500 మంది చిన్నారులు ఒకటో తరగతిలో చేరగా, 50 వేలకుపైగా మంది విద్యార్థులు 2 నుంచి 12 మధ్య తరగతులలో ప్రవేశాలు పొందారు.
ఆగస్టు వరకు 2.5లక్షలకుపైగా అడ్మిషన్లు నమోదవుతాయని అధికారులు అంచనాలేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులో ఉండటం, మన ఊరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడులు బలోపేతం కావడంతోనే అడ్మిషన్లు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.