హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘వీ కాంట్ సే మోర్.. ప్లీజ్ కో ఆపరేట్’ ఇదీ ఈడీ తీరు. నీ పేరేమిటి? కుటుంబ సభ్యుల పేర్లేమిటి? వాళ్లేం చేస్తుంటారు? ఎక్కడెక్కడ ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు వేసిన ఈడీ అధికారులు తిరిగి మంగళవారం హాజరుకావాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి సూచించారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు (6 గంటలపాటు) రోహిత్రెడ్డిని ఈడీ విచారించింది. విచారణ అనంతరం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద రోహిత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పానన్నారు.
వ్యక్తిగత విషయాలు, వ్యాపార వివరాలు మాత్రమే ఈడీ అధికారులు పదే పదే అడిగారని చెప్పారు. తనను ఎందుకు పిలిచారు? ఏ కేసులో పిలిచారు? తనపై వచ్చిన ఫిర్యాదు ఏమిటి? అని తానే అధికారులను అడిగానని, దానికి వారు ‘ప్లీజ్ కో ఆపరేట్.. వీ కాంట్ సే మోర్’ అని బదులిచ్చారని వివరించారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలన్నారని పేర్కొన్నారు. అధికారులు కోరిన విధంగా హాజరవుతానని చెప్పారు. ఈడీ విచారణ నేపథ్యంపై తమ న్యాయనిపుణులతో చర్చిస్తానని తెలిపారు.