హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్తోపాటు ఇంజినీర్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీర్స్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ సంఘాలు ఖండించాయి. ఇంజినీర్లకు రేవంత్ క్షమాపణ చెప్పాలని, మురళీధర్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంగళవారం ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాకులో మూడు పిల్లర్ల కుంగుబాటుపై రేవంత్ దురహంకారపూరితంగా ఈఎన్సీని, ఇంజినీర్లను కించపర్చడంపై మండిపడ్డారు.
రేవంత్ సహా అనేకమంది మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేస్తున్నారని ఇంజినీర్ల సంఘాల నేతలు మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్ సహా అన్ని కాంపొనెంట్ల డిజైన్లను దేశంలోనే పేరెన్నికగన్న సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు రూపొందించారని తెలిపారు. దేశంలోనే నాణ్యతా ప్రమాణాలకు, నిర్మాణ సమర్థతకు మారుపేరుగా ఉన్న ఎల్ అండ్టీ సంస్థ బరాజ్ను నిర్మించిందని చెప్పారు. భవనాలకు వేసే పునాదులు, నదులకు అడ్డంగా ఇసుక నేలలపై నిర్మించే బరాజ్లకు సాంకేతికంగా చాలా తేడా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. నదీ గర్భంలో మార్పుల కారణంగానే ఈ ఘటన జరిగిందని స్పష్టం చేశారు. అది దుదృష్టకరమైనదేనని, కారణాలను అన్వేషించి పునరుద్ధరణ చర్యలు చేపడుతామని చెప్పారు. గంగానదిపై నిర్మించిన ఫరకా బరాజ్, గోదావరిపై నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ బరాజ్, కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బరాజ్ పిల్లర్లు గతంలో కుంగిపోగా, పునరుద్ధరించారని పేర్కొన్నారు.
మేడిగడ్డ బరాజ్ బ్లాక్ 7లో జరిగిన పిల్లర్ల కుంగుబాటు ప్రభావం ఇతర బ్లాకుల మీద లేదని ఇంజినీర్ల సంఘాల నేతలు స్పష్టం చేశారు. మొత్తం బరాజ్ పనికిరాకుండా పో తుందన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. పునరావాస పనులు బ్లాక్ 7లో మా త్రమే జరుగుతాయని స్పష్టంచేశారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని బ్లాకుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఈఎన్సీ ఆదేశాలు జారీచేశారన్నారు. అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండీ, అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న, కొండపోచమ్మ, శ్రీరాంసాగర్లో పుషలంగా నీటి నిల్వలు ఉన్నాయని, ఇవి యాసంగి సాగునీరుతోపాటు వచ్చే వానకాలం వరకు తాగునీటి సరఫరాకు సరిపోతాయని వివరించారు.