నరేగాతో ఆస్తులు సృష్టిస్తున్నాం.. కేంద్రానికి కన్ను కుట్టే ఇబ్బంది పెడుతున్నది
హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వం నరేగా నిధులతో రైతు వేదికలు కట్టవద్దని, కల్లాలు కట్టవద్దని అంటున్నదని, నరేగా అంటే ఇక్కడి మట్టి తీసి అక్కడ, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసుడా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘యూపీఏ నుంచి ఇప్పటి దాకా అదే జరిగింది కదా! ఈ రోజు నరేగాలో తెలంగాణలో జరుగుతున్న పని దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇది వాళ్ల రిపోర్టులు చెప్తున్నదే. ఈ పనులతో కొన్ని అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం. పార్లమెంటులో ఇన్నాళ్లూ ఎంపీలు చెప్పింది కూడా అసెట్స్ క్రియేట్ చేయమనే కదా? నేడు తెలంగాణలో అసెట్స్ క్రియేట్ అవడం వాళ్లకు ఇష్టం లేదు. పైగా అవకతవకలు జరిగినాయని అరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు’ అని మండిపడ్డారు.
‘రైతుల మీద పగబట్టి యాసంగి వడ్లు, పారాబాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పారు. ఇప్పుడు మళ్లీ వరిని ప్రోత్సహించండి అని చెప్తున్నరు. గవర్నమెంటును నడుపుతున్నారా? లేక సర్కస్ నడుపుతున్నారా? ఈ రోజు వరకు సీఎంఆర్ బియ్యం తీసుకోలేదు. పైగా ఎఫ్సీఐ వాళ్లను పంపించి మిల్లర్లను ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ వాళ్లు ‘పల్లె ఘోష- బీజేపీ భరోసా’ అని పిలుపునిచ్చారు. అసలేమైనా తెలివి ఉన్నదా వాళ్లకు? దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాలకు వెళ్దాం. అక్కడ పల్లెలు ఘోషిస్తున్నాయో, తెలంగాణ పల్లెలు గోస పడుతున్నాయో చూద్దాం. కేంద్రం 20 అవార్డులు ఇస్తే, అందులో 19 తెలంగాణకు ఇస్తది. వీళ్లేమో ఘోష అని బయలుదేరుతరు’ అని విమర్శించారు.