శేరిలింగంపల్లి, మార్చి 20: ఐటీ కారిడార్కు కూతవేటు దూరంలోని గోపన్పల్లిలో వేల కోట్ల విలువైన భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో దర్జాగా రహదారి నిర్మాణం చేపడుతున్నారు. పెద్దఎత్తున్న పొక్లెయినర్లు, జేసీబీలతో పట్టపగలు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులకు తెరలేపారు. రంగారెడ్డిజిల్లా, శేరిలింగంపల్లి మండలం, గోపనపల్లిలో సర్వేనంబర్ 36, 37లో ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్రంలో 428 ఎకరాల భూమిని కేటాయించారు. ఎనిమిది నెలల క్రితం భాగ్యనగర్ టీఎన్జీవోస్కు చెందిన సదరు లేఅవుట్లోని భూమిని కొందరు అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకోగా ఈ వివాదం కోర్టుకెక్కింది.
తాజాగా శుక్రవారం మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు గోపన్పల్లి ఎన్టీఆర్నగర్ ప్రధాన రహదారి నుంచి కొత్తగా 100 అడుగుల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున టిప్పర్ల ద్వారా మట్టి డంపింగ్ చేసి జేసీబీలతో చదును చేస్తున్నారు. ఓ క్రషర్ సంస్థకు చెందిన ప్రైవేట్ వ్యక్తులు ఈ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత శేరిలింగంపల్లి మం డల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డిని వివరణ కోరగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు.