Medaram | ఏటూరునాగారం/వాజేడు/ములుగు రూరల్/తాడ్వాయి, ఫిబ్రవరి 21: మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు 20 నిమిషాలపాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారంగా మారింది. నడుచుకుంటూ పుణ్యస్నానాలు చేసేందుకు కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు తమవారు కనిపించక ఆందోళనపడ్డారు.
స్నానఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నుంచి నీళ్లు రాకపోవడంతో వేలాది మంది స్నానాలు మధ్యలోనే ఆగిపోయాయి. కాగా ఛత్తీస్గఢ్, భద్రాచలం, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన వారు ఊరట్టం వైపు గుడారాలు వేసుకొని విడిది చేయగా, నీటి కోసం ట్యాంకర్ల వెంట పరుగులు తీశారు. రెడ్డిగూడెంలో గద్దెలకు సమీపంలో ఉన్న ఒక్క బోరింగు వద్ద బకెట్లను వరుసగా పెట్టి గంటల తరబడి వేచి ఉన్నారు. అటు కరెంట్, ఇటు నీటి సరఫరా లోపంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.