సూర్యాపేట, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్లుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇంతటి ప్రశాంత వాతావరణంలో ఉండటం ఇష్టంలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిప్పులు పోసే కుట్రలు చేస్తున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. తెలంగాణ చరిత్ర, ఎల్లలు కూడా తెలియని బీజేపీ నాయకులు ఇక్కడ రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం సూర్యాపేటలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఎనిమిదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు కావాలని దేశ ప్రజలు కోరుతుండటంతో తెలంగాణను చీకట్లలోకి నెట్టే కుయుక్తులు పన్నుతున్నదని విమర్శించారు. దేవుడు, దయ్యాల పేర్లు చెప్పి పబ్బం గడుపుకోవడమే తప్ప కాంగ్రెస్, బీజేపీలకు ప్రజల ఆకలి తెలియదన్నారు. ప్రశాంతంగా కలిసిమెలిసి జీవిస్తున్న తెలంగాణలో ఓట్ల కోసం చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకరి సంస్కృతిని ఇంకొకరు గౌరవించుకొని జీవిస్తున్న ప్రజల మధ్య బీజేపీ నేతలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణ ఎల్లలు, చరిత్ర తెలియని అమిత్ షా వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకొంటున్నారని తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి బ్రిటీష్ వారి చేతిలో ప్రాణాలొడ్డిన అల్లూరి సీతారామరాజు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించాడని అమిత్ షా మాట్లాడటం ఆ పార్టీ నాయకుల బుద్ధిహీనతకు అద్దం పడుతుందని విమర్శించారు.
ఎనిమిదేండ్లుగా పొత్తిళ్లలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకోవాల్సిందిపోయి.. తల్లి, తండ్రి పాత్రలో ఉండే కేంద్రం బిడ్డ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీ దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ మాదిరిగా 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ తాగునీరు కావాలని, రైతుబంధు ఇవ్వాలని ప్రజలు కోరుతుండటంతో అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్లా పాలన చేయ చేతగాకనే తెలంగాణను చీకట్లోకి నెట్టాలనే కుట్రకు దిగుతుండ్రని దుయ్యబట్టారు. బ్యాంకుల నుంచి రుణాలు రాకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.