Electricity Consumption | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తుఫాను ప్రభావం విద్యుత్తు డిమాండ్ను తగ్గించింది. ఒకే ఒక్క రోజులో సుమారు 1200 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గడం విశేషం. మిగ్జాం తుఫాను కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరం చల్లబడింది. గృహ, వాణిజ్య రంగాలతోపాటు, యాసంగి వరి నార్లు పోస్తున్న నేపథ్యంలో.. వ్యవసాయరంగంలోనూ మోటర్ల వినియోగం చాలా వరకు తగ్గింది. ఒక్కసారిగా మూడు ముఖ్యమైన రంగాల్లో విద్యుత్తు వినియోగం తగ్గడంతో డిమాండ్ పడిపోయింది.
రాష్ట్రంలో ఈ నెల 4న 10,264 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవ్వగా.. 5న 9,079 మెగావాట్లకు తగ్గింది. ఒక్క రోజులో సుమారు 1200 మెగావాట్లు తగ్గింది. బుధవారం (ఈనెల 6న) మరింత తగ్గి 8,892 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. తుఫాను ప్రభావం ఈనెల 7 తరువాత తగ్గనుందని వాతావరణ శాఖ చెప్పడంతో.. విద్యుత్తు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు ఇదే సమయంతో పోల్చితే ఈ యేడాది విద్యుత్తు డిమాండ్ గణనీయంగా తగ్గింది.