తెలంగాణలో టారిఫ్లు తక్కువ , 24 గంటల కరెంటు
సోయి తప్పి పాదయాత్రలో బీజేపీ నేతల విమర్శలు
తిమ్మిని బమ్మి చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ధ్వజం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే విద్యుత్తు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. అధిక విద్యుత్తు చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కూడా బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోటీ పడుతున్నాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కనీస సోయి లేకుండా పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. బీజేపీ నేతల నిర్వాకం నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. తిమ్మిని బమ్మి చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్తు చార్జీలు ఎకువ వసూలు చేయడంతో పాటు 7 గంటల పాటే కరెంటు సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు. ఆయా రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణలోనే విద్యుత్తు చార్జీలు తక్కువ అని, ఇక్కడ 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని వివరించారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం.. దేశంలో తెలంగాణ ఒకటేనని స్పష్టం చేశారు. పరిశ్రమలకు కూడా ఇతర రాష్ట్రాల కంటే తకువ చార్జీలతో విద్యుత్తు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులు సాధ్యమయ్యాయని కొనియాడారు. రాష్ర్టాభివృద్ధిని జీర్ణించుకోలేకే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘బీజేపీ రాష్ట్ర నాయకుల్లారా! వాస్తవాలను ఇప్పటికైనా గ్రహించి తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి’ అని హితవు పలికారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో, తెలంగాణలో వసూలు చేస్తున్న విద్యుత్తు చార్జీలను పోల్చుతూ వివరాలను పేర్కొన్నారు.