హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కాలుష్యం కారణంగా ప్రజలు విద్యుత్తు వాహనాల (ఈవీ) వైపు దృష్టి సారిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటంతో ఈ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నది. ఈవీలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-30’ని మన రాష్ట్రం గతేడాది అక్టోబర్లో రూపొందించింది. రాష్ర్టాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ హబ్గా మార్చాలని, మరిన్ని పెట్టుబుడులు ఆకర్షించాలని సంకల్పించింది. ఈవీలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. అన్ని మెట్రోరైలు స్టేషన్ల నుంచి బ్యాటరీతో నడిచే ఫీడర్ షటిల్ సర్వీసులను ఏర్పాటుచేయాలని నిశ్చయించింది.
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో బ్యాటరీల తయారీ పరిశ్రమలకు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, ఇప్పటికే మూడునాలుగు సంస్థలు పరిశ్రమల స్థాపనకు మొదుకొచ్చాయి. వాహనాల తయారీ కోసం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్వల్లిలో 300 ఎకరాల కేటాయించగా, ఒక చైనా సంస్థతోపాటు మన దేశానికి చెందిన మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తంచేసింది. తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్రెడ్కో) కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి పలు ఈవీ, బ్యాటరీ తయారీ పరిశ్రమల యాజమాన్యాలతో పెట్టుబడుల కోసం చర్చలు జరుపుతున్నారు. కొద్ది నెలల్లోనే ఇవి కార్యరూపం దాల్చుతాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.