హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య నివారణతోపాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ.. త్వరలో 25 ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రొటోటైప్ (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. అందులో ప్రయాణికులకు కల్పించే సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) సంస్థకు ఆర్డర్ ఇచ్చామని, వాటిలో 500 బస్సులను నగరంలో, మిగిలిన 50 బస్సులను విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించామని వివరించారు. ఇప్పటికే విజయవాడ రూట్లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో తొలి విడతగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని, వాటిలో 30 బస్సులు ఐటీ కారిడార్లో, 20 బస్సులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో తిరుగుతాయని వివరించారు. హైటెక్ సౌకర్యాలున్న ఈ బస్సుల్లో ఒక్కో దాంట్లో నెల రోజుల రికార్డింగ్ బ్యాకప్ సదుపాయంతో కూడిన మూడు సీసీటీవీ కెమెరాలతోపాటు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా, మొబైల్ చార్జింగ్ వసతి, సీటు బెల్ట్ సదుపాయం ఉన్నది. అగ్నిప్రమాదాలను గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం (ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత కోసం వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు.