హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా, ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'(సర్) ప్రక్రియను చేపట్టినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాలయం వెల్లడించింది. తరచూ వలసలు వెళ్లడం వల్ల ఒకే ఓటరు రెండుచోట్ల నమోదు కావడం, చనిపోయిన వారి పేర్లు జాబితాలోనే ఉండటం వంటి లోపాలను సరిదిద్దడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ‘సర్’ఫై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు, అనుమానాలను నివృత్తి చేసేందుకు గురువారం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘రాష్ట్రంలో‘సర్’ప్రక్రియ జూన్ 25న ప్రారంభమై అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనున్నది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్స్థాయి అధికారులు(బీఎల్వో) ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాల సేకరణ(ఎన్యుమరేషన్) చేపడుతారు. జూలై 31న డ్రాఫ్ట్ (ప్రాథమిక) ఓటరు జాబితా ప్రచురిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల దాఖలుకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్ 28లోపు దరఖాస్తుల పరిశీలన, నోటీసుల జారీ పరిషారం ఉంటుంది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు’ అని సీఈవో కార్యాలయం వివరించింది.
గృహ సందర్శన ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటినీ కనీసం మూడుసార్లు సందర్శిస్తారు. మీ ఇంటికి వచ్చి ముందుగా ముద్రించిన ‘ఎన్యుమరేషన్ ఫారాలు’(రెండు కాపీలు) అందించి, వాటిని ఎలా నింపాలో వివరిస్తారు. ఓటరు వివరాలు నింపిన తర్వాత, ఒక కాపీని బీఎల్వో తన వద్ద ఉంచుకుని, రెండో కాపీ రసీదుగా ఓటరుకు అందజేస్తారు. 18 ఏండ్లు నిండిన వారు లేదా 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకోబోయే వారు కూడా కొత్తగా ఓటుహకు కోసం బీఎల్వో ద్వారా ఫారం-6, డిక్లరేషన్ ఫారం పొంది దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో, అంటే నేరుగా ఫారం ఇవ్వకూడదనుకుంటే లేదా బీఎల్వో వచ్చే సమయానికి ఇంట్లో లేకపోయినా ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేయవచ్చు. ఓటర్లు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ https://voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఎపిక్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా అథెంటికేషన్ పూర్తిచేయాలి.
ఎన్యుమరేషన్ ఫారం సమర్పించేందుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు. అది పూర్తిగా ఐచ్ఛికం. ఓటరుకు ఇష్టముంటేనే ఆధార్ వివరాలు నమోదు చేయవచ్చు. ఎన్యుమరేషన్ ఫారంలో ఫొటో తప్పుగా ఉన్నా లేదా పాతదైనా, ఆ ఫారంలో కేటాయించిన స్థలంలో మీ తాజా పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించి బీఎల్వోకు అందించాలి. ఓటర్లు తమ ఫారాలను నింపి బీఎల్వోకు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ ఫారం తిరిగి ఇవ్వని పక్షంలో సదరు ఓటరు చనిపోయాడా, ఇల్లు మారాడా లేక డూప్లికేట్ ఓటా అనేది పొరుగువారి ద్వారా బీఎల్వో విచారణ జరిపి, ఆ పేరును డ్రాఫ్ట్ ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉంటుంది. కుటుంబసభ్యులు ఇతర నగరాలు, రాష్ట్రాలు, విదేశాల్లో ఉద్యోగం చేసే వారైతే ఎన్యుమరేషన్ ఫారాన్ని ఇంట్లోని ఇతర పెద్దలు పూర్తిచేయవచ్చు. వారి తరఫున కుటుంబసభ్యుడే సంతకం చేసి బీఎల్వోకు అందజేయవచ్చు. అయితే, ఎన్యుమరేషన్ దశలో ఓటరు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. జూలై 31న డ్రాఫ్ట్ రోల్ విడుదలయ్యాక, ఓటరు అర్హతపై ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారికి ఏమైనా అనుమానాలుండి నోటీసు ఇస్తే, అప్పుడు మాత్రమే పాస్పోర్ట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు వంటి పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
‘సర్’ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా, దరఖాస్తులు నింపడంలో ఇబ్బందులు ఎదురైనా సహాయం చేయడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్డెసులు ఏర్పాటుచేశారు. ఇకడ శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండి ఓటర్లకు మార్గదర్శనం చేస్తారు. ‘సర్’పై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తారు. ఓటర్లు తమ బీఎల్వోల నంబర్ల కోసం https://ceotelangana.nic.in వెబ్సైట్ను చూడవచ్చు. ఏదైనా సమాచారం లేదా సందేహాల కోసం టోల్ఫ్రీ నంబర్ 1950కి కాల్ చేసి సహాయం పొందవచ్చు.